శ్రీ లంక పర్యటనలో సత్తా చాటాలి
టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్
కొలంబో: శ్రీలంకతో జరిగే రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ను చేజిక్కించుకుంటామని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ధీమా వ్యక్తం చేశాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ) గురువారం విడుదల చేసిన ఒక వీడియోలో గంభీర్ ఈ విషయాన్ని వెల్లడించాడు.‘‘ఇటీవలి కాలంలో టెస్టుల్లో మనం ఆశించినస్థాయిలో రాణించలేకపోతున్నాం. స్వదేశీ పిచ్లపైనే నిరాశపరుస్తున్నాం.. మన ముందు ఏముందో, మనం దేని కోసం ఆడుతున్నామో అందరికీ తెలుసు. మన సామర్థ్యానికి మించి రాణించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ సిరీస్ గెలుపుతో మనపై వచ్చే విమర్శలకు సమాధానం చెప్పినవారమవుతాం’’ అని పేర్కొన్నాడు. "మన జట్టులోకి కొందరు కొత్త ఆటగాళ్లు వచ్చారు. సారాంశ్.. నీకు అభినందనలు. ఇక్కడికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డావు" అని మధ్యప్రదేశ్ ఆల్రౌండర్కు టీమిండియా క్యాప్ అందించాడు. "అవకాశం దొరికినప్పుడల్లా కుటుంబం, దేశం గర్వపడేలా రాణించాలి." అని పేర్కొన్నాడు. "రెండోది ఆకిబ్ను అభినందించాలనుకుంటున్నాను. గత సీజన్లో అద్భుతంగా రాణించావు, జమ్మూ-కాశ్మీర్ జట్టు రంజీ ట్రోఫీ టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించావు. ఇది నిజంగా గొప్ప విజయం. మరోసారి అభినందనలు" అన్నాడు. కొత్తగా జట్టులోకి ఎంపికైన సారాంశ్ జైన్ మరియు ఆకిబ్ నబీలతో పాటు, కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్లకు కూడా గంభీర్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి, ఆటగాళ్లకు పరిచయం చేశాడు.
లంక వార్మప్ జట్టు కెప్టెన్గా సొనాల్...
రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్కు ముందు భారత్జట్టు శ్రీలంకతో మూడ్రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక జట్టు 15మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. శుక్రవారం నుంచి మూడ్రోజుల వార్మప్ మ్యాచ్ కొలంబోలోని ఎన్సిసి మైదానంలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత గాలేకు టీమిండియా బయల్దేరి వెళ్లనుంది. శ్రీలంకతో తొలి టెస్ట్ ఆగస్టు 15నుంచి, రెండో టెస్ట్ ఆగస్టు 23నుంచి కొలంబోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో జరగనున్నాయి.
శ్రీలంక వార్మప్ జట్టు: సొనాల్ దినుషా(కెప్టెన్), మధుశంక, రషంత్, సూరియ భండారా, రత్నాయకే, విక్రమసింఘే, అంజలా భండారా(వికెట్ కీపర్), ధనంజయ, లాహిరు కుమార, ఫెర్నాండో, మనోజ్, విజెసుందర, రమేశ్ మెండీస్, కేశర నువంతా, సుధీర.







కామెంట్లు (0)