న్యూఢిల్లీ : టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధానపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ అంజుమ్ చోప్రా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఒక్క మ్యాచ్లో విఫలమైనంత మాత్రాన స్మృతి వంటి స్టార్ ప్లేయర్ను విమర్శించడం సరికాదంటూ ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆసియా మహిళల టి20 కప్-2026లో హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో స్మృతి శతకంతో చెలరేగారు. తద్వారా మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా నిలవడంతో పాటు.. అత్యధిక పరుగుల విషయంలో మిథాలీ రాజ్ రికార్డును అధిగమించారు. అయితే పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో స్మృతి 11 బంతుల్లో తొమ్మిది పరుగులకే వెనుదిరిగారు. అంతకుముందు తొలి బంతికే క్యాచ్ అవుట్ అయ్యే పరిస్థితి ఎదురైనా అంపైర్ నిర్ణయంతో ఆమెకు లైఫ్ లభించింది. దీనిపై అంజుమ్ చోప్రా స్పందిస్తూ ... అంపైర్ నిర్ణయంతో బతికిపోయిన స్మృతి, ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయిందని వ్యాఖ్యానించారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమవుతుంటే ప్రతీసారీ కెప్టెన్ వచ్చి పరుగులు చేయాలా ? అని ప్రశ్నించారు. అంజుమ్ వ్యాఖ్యలపై స్మృతి అభిమానులు మండిపడుతున్నారు. ఒక మ్యాచ్లో వైఫల్యాన్ని ఆధారంగా చేసుకుని స్మృతి స్థాయిని తక్కువ చేసి మాట్లాడటం తగదని, జట్టు విజయాల్లో ఆమె అందించిన కీలక సహకారాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు.








కామెంట్లు (0)