ముఖ్య అతిథిగా సినీ నటుడు రామ్ చరణ్
ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ (గుంటూరు జిల్లా): గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ మండలం నవులూరులోని ఎసిఎ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తొలిసారిగా ఎపిఎల్-2026 టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. బుధవారం నుంచి 30 వరకు జరగనున్న ఈ టోర్నమెంట్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గౌరవ వైస్ ప్రెసిడెంట్ బండారు నరసింహారావు, సెక్రటరీ ఎస్ సతీష్ బాబు, జాయింట్ సెక్రెటరీ బి విజయ్ కుమార్, కోశాధికారి డి శ్రీనివాస్ తెలిపారు. ఆటగాళ్లు, ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యమూ కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మొదటి రోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని, ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారని తెలిపారు. ఎసిఎ అధ్యక్షుడు, విజయవాడ ఎంపి కేశినేని చిన్ని, ఎసిఎ కార్యదర్శి, అమలాపురం ఎంపి సానా సతీష్తో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారని తెలిపారు. భద్రతా, బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పి వకుల్ జిందాల్ మంగళవారం పరిశీలించారు. ఎలిమినేటర్, క్వాలిఫైయర్, ఫైనల్ మ్యాచ్ల సమయంలో అదనపు పోలీసు బలగాలు, ప్రత్యేక నిఘా బృందాలను మోహరించనున్నట్లు ఎస్పి తెలిపారు.









కామెంట్లు (0)