కోల్కతా : ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ను పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచార ఆరోపణల కేసులో కోల్కతా డుమ్డుమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమామి సిటీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని హూగ్లీ రూరల్ ఎస్పీ కున్వార్ భూషణ్ సింగ్ ధ్రువీకరించినట్లు తెలిసింది.
అభిషేక్ పోరెల్పై ఓ వైద్య విద్యార్థిని జూన్లో ఫిర్యాదు చేసింది. గత మూడేళ్లుగా తమ మధ్య సంబంధం ఉందని, ఏడాది కాలంగా తనను పోరెల్ దూరం పెడుతున్నాడని ఆమె ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను లైంగికంగా ఉపయోగించుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని, తమ వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించి వాటిని చూపిస్తూ బెదిరిస్తున్నాడని ఆరోపించింది. ఈ ఫిర్యాదుపై నమోదైన కేసులో కోల్కతా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అభిషేక్ పోరెల్కు చెందిన మొబైల్ ఫోన్ సహా ఎలక్ట్రానిక్ పరికరాలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని, అతడిని అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతడిని తాజాగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను అభిషేక్ పోరెల్ ఖండించారు. అవి అవాస్తవమని పేర్కొన్నారు. 24 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన పోరెల్ 2023లో ఐపీఎల్లో అరంగేట్రం చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఇప్పటివరకు 35 మ్యాచ్లు ఆడి 769 పరుగులు చేశారు. గతంలో భారత్-ఎ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ యూకే, ఆస్ట్రేలియాలోనూ మ్యాచ్లు ఆడారు. బెంగాల్ తరఫున 2021-22 సీజన్లో ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన పోరెల్ 32 మ్యాచ్లు ఆడారు. లిస్ట్-ఎ క్రికెట్లో 23 మ్యాచ్ల్లో పాల్గొన్నారు.








కామెంట్లు (0)