న్యూఢిల్లీ: స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగిన 2026 కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించి తిరిగి వచ్చిన క్రీడాకారులకు ఘన స్వాగతం లభించింది. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం విచ్చేసిన వీరిని హర్యానా క్రీడల శాఖ సహాయ మంత్రి గౌరవ్ గౌతమ్ విమానాశ్రయానికి వచ్చి పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అథ్లెట్లంతా బయటకు వచ్చేవరకు దేశభక్తి గీతాలు, సాంప్రదాయ డప్పులు, పుష్పగుచ్ఛాలతో, పూల జల్లులతో స్వాగతం పలికారు. విమానాశ్రయ ప్రాంగణం 'భారత్ మాతా కీ జై' నినాదాలు మారుమోగింది. క్రీడాకారులను అభినందిస్తూ శ్రీ గౌరవ్ గౌతమ్ మాట్లాడుతూ... వారి అంకితభావం, క్రమశిక్షణ, అసాధారణ ప్రదర్శనలు దేశానికి అపారమైన గర్వాన్ని తెచ్చిపెట్టాయని, అంతర్జాతీయ క్రీడల్లో భారతదేశ స్థాయిని ఇనుమడింపజేశారని కొనియాడారు. ఈ విజయాలు యువతకు ప్రేరణగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు. హర్యానా ప్రభుత్వం రాష్ట్రంలో క్రీడలను బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. పతకాలు గెలిచిన వారికి నగదు ప్రోత్సాహకాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తదుపరి తరానికి మార్గనిర్దేశం మీ విజయాలేనని కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. 122 మంది అథ్లెట్లతో గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 క్రీడల్లో పాల్గొన్న భారత బృందం 39 పతకాలతో సత్తా చాటిన సంగతి తెలిసిందే.










కామెంట్లు (0)