అండర్-20 ఛాంపియన్షిప్స్లో 74.09 మీటర్ల ప్రదర్శన
ఒరెగాన్ : ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా స్ఫూర్తితో భారత యువ అథ్లెట్లు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటుతున్నారు. జావెలిన్ త్రోలో భావి తారగా ఎదుగుతున్న 19 ఏళ్ల అశీష్ యాదవ్ అండర్-20 ఛాంపియన్షిప్స్-2026లో రజత పతకాన్ని సాధించారు. పదేళ్ల క్రితం నీరజ్ చోప్రా స్వర్ణం సాధించిన ఇదే వేదికపై అశీష్ రజతంతో మెరిశారు. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో అశీష్ తొలి ప్రయత్నంలో 69.96 మీటర్లు విసరగా.. రెండో ప్రయత్నం ఫౌల్ అయింది. మూడో ప్రయత్నంలో 74.09 మీటర్ల దూరం ఈటెను విసిరి రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. 2016లో నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించిన తర్వాత జూనియర్ స్థాయిలో భారత్కు జావెలిన్లో పతకం దక్కలేదు. పలువురు అథ్లెట్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే అశీష్ తన అద్భుత ప్రదర్శనతో పదేళ్ల నిరీక్షణకు తెరదించారు. దక్షిణాఫ్రికాకు చెందిన జాన్ హెండ్రిక్ హేమన్స్ 80.50 మీటర్లతో స్వర్ణ పతకం సాధించగా.. డొమినికాకు చెందిన అడిసన్ జేమ్స్ 73.89 మీటర్లతో కాంస్యాన్ని సొంతం చేసుకున్నారు.







కామెంట్లు (0)