మాధవరం అనే ఊరిలో రంగయ్య, వీరయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రంగయ్య మంచి స్వభావం గలవాడు. కానీ వీరయ్యకి ఆశ ఎక్కువ. ఒకరోజు వీరిద్దరూ కలిసి పొలానికి వెళ్లారు. పొలం పని ముగించుకుని వస్తూ ఉండగా మార్గం మధ్యలో వారికి ఒక డబ్బు సంచి దొరికింది. వెంటనే రంగయ్య ‘వీరయ్యా! ఇక్కడ ఎవరో డబ్బు సంచని పోగొట్టుకొని వెళ్లారు. మనం వెంటనే వెళ్లి పోలీసులకి చెప్పి, ఆ డబ్బుని వారికి అప్పగించడం మంచిది’ అన్నాడు. అది విని వీరయ్య కోపంగా ‘నీకు డబ్బు అవసరం లేకపోతే తీసుకోవద్దు. నేను తీసుకుంటాను’ అని అన్నాడు. దానికి రంగయ్య ‘ఎవరిదో పాపం డబ్బు పోగొట్టుకున్నారు. వారి డబ్బు మనకి ఎందుకు? వారికి అప్పజెప్పడమే మంచిది’ అని బాధగా అక్కడ నుండి వెళ్లిపోతాడు. కానీ వీరయ్య మాత్రం రంగయ్య మాట వినలేదు. డబ్బు సంచిని తీసుకుని ఇంటికి వెళ్లాడు. కొంత సమయం తర్వాత డబ్బును పోగొట్టుకున్న వ్యక్తి ఆ ప్రాంతానికి వచ్చి వెతికాడు. కానీ డబ్బు సంచి కనిపించలేదు. వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లి, జరిగిన విషయం చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి, పోగొట్టుకున్న స్థలం వద్దకు వెళ్లి, మొత్తం వెతికారు. లాభం లేకపోయింది. పక్క గ్రామానికి వెళ్లి, ప్రజలను పంచాయతీ దగ్గరకు పిలిపించి, డబ్బు సంచి గురించి ఆరా తీశారు. కానీ ఎవరూ ఏమీ సమాచారం ఇవ్వలేదు. తర్వాత పోలీసులు అందరి ఇళ్లల్లో శోధించారు. ఆ క్రమంలో వీరయ్య ఇంట్లో డబ్బు సంచి దొరుకుతుంది. వీరయ్యను పోలీసులు తీసుకువెళ్లి, శిక్షించారు.
నీతి: పరాయి సొమ్ముతో ప్రమాదం పొంచి ఉంటుంది.
ఎ. ప్రత్యూష
6వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పారసాం,
నెల్లిమర్ల మండలం, విజయనగరం జిల్లా.







కామెంట్లు (0)