రూ. 40 లక్షలకు ‘డ్రగ్ ఇన్స్పెక్టర్’ ప్రశ్నాప్రతం
నియామక ప్రక్రియ నిలిపివేత
ముంబయి : దేశంలో బిజెపి, దాని భాగస్వామ్య పక్షాల ప్రభుత్వాల ఏలుబడిలోని రాష్ట్రాల్లో పేపర్ లీక్ ఘటనలు ఆగడం లేదు. తాజాగా బిజెపి డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్న మహారాష్ర్టలో పేపర్ లీక్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది మార్చిలో డ్రగ్ ఇన్స్పెక్టర్ గ్రూప్-బి పోస్టుల కోసం జరిగిన నియామక పరీక్ష లీకయింది. ఈ ప్రశ్నాపత్రాన్ని ఏకంగా రూ.40 లక్షల చొప్పున విక్రయించినట్లు సమాచారం. దీనిపై ఆందోళనలు ఉధృత్వం కావడంతో ఉద్యోగ నియామక ప్రక్రియను మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపిఎస్సి) బుధవారం రద్దు చేయాల్సివచ్చింది. అవకతవకలపై ప్రాథమిక విచారణ అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పరీక్ష నిర్వహణకు ముందే ఒక అభ్యర్థికి ప్రశ్నపత్రం అందినట్లు పోలీసు విచారణలో ప్రాథమికంగా తేలిందని అంతకుముందు ఎంపిఎస్సి వెల్లడించింది. ఇటీవల నీట్ పరిక్షా పేపర్ లీక్పై విద్యార్థుల ఉద్యమం దేశాన్నికుదిపేసిన సంగతి తెలిసిందే. అయినా బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్ పరిక్షల నిర్వహణలో నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుంది.
సోషల్ మీడియాలో ప్రశ్నాపత్రం ప్రత్యక్షం..
పరీక్షకు ముందే తాము ప్రశ్నాపత్రాన్ని పొందినట్లు జులై 22-26 మధ్య కొందరు ఎంపిఎస్సి అభ్యర్థులు పేర్కొన్నారు. మరికొందరు సోషల్ మీడియాలో పూర్తి ప్రశ్నాపత్రం లభించిందని వెల్లడించారు. దీంతో ఎంపిఎస్సి జులై 27న ముంబయి పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసింది. ఒక అభ్యర్థికి ప్రశ్నపత్రం లభించిందని, దీంతో ఆ అభ్యర్థి లబ్ధి పొందారని ప్రాథమికంగా తేలినట్లు ముంబయి పోలీసు క్రైమ్ బ్రాంచ్ సమర్పించిన నివేదిక తెలిపింది. అయితే ఈ ప్రశ్నాపత్రంతో ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది లబ్ధి పొందారా లేదా అనేది స్పష్టంగా తెలియాల్సి వుందని స్పష్టం చేసింది. మరోసారి పరీక్షను నిర్వహించనున్నట్లు ఎంపిఎస్సి తెలిపింది. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదని, ఎలాంటి పరీక్ష రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. పునఃపరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ను విడిగా ప్రచురించనున్నట్లు పేర్కొంది. ఎంపిఎస్సి ఈ పోస్టుకు సంబంధించి గతేడాది జులై 29న తొలి నోటిఫికేషన్ జారీ చేయగా, రాష్ట్రంలోని ఆరు డివిజనల్ ప్రధాన కార్యాలయాల్లోని కేంద్రాల్లో మార్చి 22న ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహించారు. ఫలితాలను జూన్ 12న ప్రకటించారు. 506 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు అర్హులుగా తేల్చారు. వారిలో 488 మంది జులై 1 నుండి జులై 22 మధ్య జరిగిన రౌండ్లో ఉత్తీర్ణులయ్యారు. 488 మంది అభ్యర్థులతో కూడిన తాత్కాలిక సాధారణ మెరిట్ జాబితాను విడుదల చేయగా, అందులో 485 మంది అభ్యర్థులు అర్హులుగా పరిగణించబడ్డారు.







కామెంట్లు (0)