న్యూయార్క్ లో నిరసనల వెల్లువ
మ్యాడిసన్ ఇవెంట్కు వ్యతిరేకంగా గళమెత్తిన మమ్దాని
న్యూయార్క్ : ఆర్ఎస్ఎస్ న్యూయార్క్లోని ‘మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్’ వేదికగా నిర్వహించే సభకు అనుమతించవద్దని ‘హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్’, ‘ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్’, ‘ఇంటర్ఫైత్ సెంటర్ ఆఫ్ న్యూయార్క్’ వంటి ప్రముఖ సంస్థలు బుధవారం నిరసన తెలిపాయి. ‘నో ప్లాట్ఫారం ఫర్ హేట్’ బ్యానర్ కింద జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ఆ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. భగవత్ వంటి వ్యక్తులకు ఒక వేదికగా మాడిసన్ స్క్వేర్గార్డెన్ను అనుమతించరాదని వారు న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీని కోరారు. భగవత్, హిందూ ఆధిపత్య భావజాలాన్ని సమర్ధించే వ్యక్తి అని వారు విమర్శించారు. ఆర్ఎస్ఎస్ మైనారిటీ వ్యతిరేక సంస్థ అని పేర్కొన్నారు. హింసాత్మక ఆధిపత్య భావజాలానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన వేదికను ఇచ్చేందుకు న్యూయార్క్ ఎంత మాత్రమూ అనుమతించరాదని ఐఎఎంసికి చెందిన సాఫా అహ్మద్ వ్యాఖ్యానించారు.
నేను మద్దతు ఇవ్వను : మమ్దాని
ఈ కార్యక్రమంపై న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మామ్దానీ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. విలేకరుల సమావేశంలో న్యూయార్క్ నగర మేయర్ను జర్నలిస్టులు ఆర్ఎస్ఎస్ ఈవెంట్, దానిపై వస్తున్న నిరసనల గురించి ప్రశ్నించారు. ఈ సభను రద్దు చేసే అవకాశం ఉందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు మామ్దానీ స్పందించారు. 'నేను ఈ కార్యక్రమాన్ని సమర్థించను. అయితే, ఇది ఒక ప్రయివేట్ ఈవెంట్. దీన్ని రద్దు చేసే అధికార పరిధి న్యూయార్క్ నగర ప్రభుత్వానికి ఉందో లేదో నాకు స్పష్టత లేదు' అని పేర్కొన్నారు. భారతీయ మూలాలున్న న్యూయార్క్ మేయర్ తన కుటుంబ నేపథ్యాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.
'మన నగర చరిత్రలో తొలి భారతీయ- అమెరికన్ మేయర్గా నేను ఇక్కడ ఉన్నాను. నా తల్లి కుటుంబం మొత్తం ఇప్పటికీ భారతదేశంలోనే ఉంది' అని చెప్పారు. భారత్ చాలా గొప్ప దేశమని, అది లౌకిక గణతంత్ర రాజ్యమని, అన్ని వర్గాల ప్రజలను సమానంగా ఆదరించే బహుళ సంస్కృతిగల సమాజమని తన తన కుటుంబం తనకు నేర్పినట్లు పేర్కొన్నారు. అయితే, ఏ దేశంలోనైనా ప్రజల మధ్య విభజన తెవడం, కొన్ని వర్గాలను పక్కన పెట్టే సిద్ధాంతాలు పెరుగుతుండటం తనను తీవ్రంగా కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మతం, కులం, వర్ణం, ప్రాంతం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవంగా బతకాలనే నగరానికి మేయర్గా, ఒక భారతీయ-అమెరికన్గా తాను అలాంటి విభజన తెచ్చే సిద్ధాంతాలను, కార్యక్రమాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. శతాబ్ది వేడుకులను పురస్కరించుకుని ఆర్ఎస్ఎస్ ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ అవుట్రీచ్ కార్యక్రమాలను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ అమెరికా, కెనడా, బ్రిటన్ తదితర దేశాల్లో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన న్యూయార్క్కు చేరుకున్నారు. అక్కడ జరిగే ప్రత్యేక 'యూనివర్సల్ వన్సెస్' కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరిగే ఈ భారీ సభకు సుమారు 5వేల మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.








కామెంట్లు (0)