న్యూఢిల్లీ : గ్లోబల్ టెక్ దిగ్గజం ఒరాకిల్ వేలాది మంది ఉద్యోగులపై వేటు వేసింది. కృత్రిమ మేధా (ఎఐ) సాంకేతికతపై పూర్తిస్థాయిలో దృష్టి సారించేందుకు తన వ్యాపార వ్యూహాల్లో భాగంగా పొదుపు చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో గత ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలోని 21,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ తన తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది. దీంతో 2026 మే 31 నాటికి కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 1,41,000కు పడిపోయింది. ఈ భారీ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కోసం కంపెనీ సుమారు 1.8 బిలియన్ డాలర్లను పరిహారం, ఇతర ఖర్చుల కింద వ్యయం చేసింది.
క్లౌడ్ , ఎఐ విభాగాలను బలోపేతం చేసే క్రమంలో డెవలప్మెంట్ గ్రూపును పునర్వ్యవస్థీకరిస్తున్నామని ఒరాకిల్ పేర్కొంది. ఎఐ మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా డేటా సెంటర్ల నిర్మాణానికి ఈ ఏడాది కనీసం 50 బిలియన్ డాలర్ల పెట్టుబడిని కేటాయించినట్లు సంస్థ తెలిపింది. ఎఐ రంగంలో ఆధిక్యత కోసం అమెజాన్, మెటా వంటి దిగ్గజాలు కూడా ఇదే తరహాలో భారీగా పెట్టుబడులు పెడుతూనే.. వేల సంఖ్యలో ఉద్యోగాలను తగ్గిస్తుండటం గమనార్హం. గతేడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో సుమారు లక్ష మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు.
ఈ తొలగింపుల వల్ల కొన్ని కీలక విభాగాల్లో నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఒరాకిల్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మార్పుల వల్ల స్వల్పకాలికంగా ఉత్పాదకతపై ప్రభావం పడటంతో ఆదాయంపై ఒత్తిడి పడే అవకాశం ఉందని సంస్థ హెచ్చరించింది. అయినప్పటికీ భవిష్యత్తులో అత్యుత్తమ ఏఐ ఉత్పత్తులను అందించడానికి సరైన మానవ వనరులను కలిగి ఉండటమే తమ ప్రధాన లక్ష్యమని ఒరాకిల్ స్పష్టం చేసింది.









కామెంట్లు (0)