జిఎంపిఎస్ డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గొర్రెలు, మేకల పెంపకందారులకు గతంలో అమలులో ఉన్న ఎక్స్గ్రేషియా పథకాన్ని పునరుద్ధరించి, ప్రమాదాల్లో మరణించిన పెంపకందారుల కుటుంబాలకు రూ.20 లక్షలు, సాధారణ మరణాలకు రూ.10 లక్షలు నష్టపరిహారం అందించాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జిఎంపిఎస్) రాష్ట్ర అధ్యక్షులు గంటా శ్రీరామ్, రాష్ట్ర కార్యదర్శి పూసపాటి వెంకట్రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని గొర్రెలు, మేకలకు ప్రభుత్వం ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని, ప్రకృతి విపత్తులు, ప్రమాదాల్లో మృతి చెందిన ప్రతి జీవానికి కనీసం రూ.10 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 18న పల్నాడు జిల్లా వినుకొండ పట్టణ పరిధిలోని తిమ్మాయపాలెం పుట్ట సమీపంలో పిడుగు పడి మేకల నరేంద్ర, మేకల శ్రీనుకు చెందిన 10 గొర్రెలు మృత్యువాత పడినట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు–జి.సిగడాం రైల్వే స్టేషన్ల మధ్య వాండ్రంగి రైల్వే వంతెన వద్ద శనివారం జరిగిన రైలు ప్రమాదంలో గొర్రెల కాపరి శనగల పోతయ్య (45)తో పాటు ఆయనకు చెందిన 30 గొర్రెలు మృతి చెందడం బాధాకరమన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గొర్రెలు, మేకల పెంపకందారులు ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రాణాలు కోల్పోవడం, జీవనాధారమైన పశుసంపదను కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇటువంటి కుటుంబాలకు సామాజిక, ఆర్థిక రక్షణ కల్పించేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని, బాధిత కుటుంబాలకు తక్షణ నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.








కామెంట్లు (0)