- గుంటూరులో బోర్డు తీర్మానం
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి: రాష్ర్టంలో రానున్న సీజన్లో వర్జీనియా పొగాకు ఉత్పత్తి లక్ష్యాన్ని భారీగా తగ్గిస్తూ భారత పొగాకు బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం బోర్డు అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం జరిగిన బోర్డు సమావేశంలో 2026-27లో ఉత్పత్తి లక్ష్యంపై చర్చించినట్టు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. 2025-26లో ఉత్పిత్తి లక్ష్యం 142 మిలియన్ కిలోలుగా గత ఏడాది నిర్ధారించగా 236 మిలియన్ కిలోల ఉత్పత్తి జరిగినట్టు అంచనా వేశారు. దీంతో, ధరలు భారీగా తగ్గి రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రానున్న ఏడాది కాలంలో ఉత్పత్తి అంచనాలను గణనీయంగా తగ్గించినట్టు పేర్కొన్నారు. 2026-27లో ఉత్పత్తి లక్ష్యం కేవలం 81 మిలియన్ కిలోలుగా నిర్ధారించారు. ఈ మేరకు బోర్డు తీర్మానం చేసినట్టు తెలిపారు. ఈ సమావేశానికి పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్ అధ్యక్షత వహించారు. పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.విశ్వశ్రీ, పార్లమెంట్ సభ్యులు పి.మహేష్కుమార్, ఐసిఎఆర్ డైరెక్టర్ శేషు మాధవ్ తదితరులు పాల్గొన్నారు. 2025-26 పంట సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు 142 మిలియన్ కిలోల పంట పరిమాణం నిర్ణయించినప్పటికీ, అధిక విస్తీర్ణంలో సాగు జరగడంతో అంచనా ఉత్పత్తి సుమారు 236 మిలియన్ కిలోలకు చేరినట్టు, ప్రస్తుతం మార్కెటింగ్ ప్రక్రియలో కొనుగోలుదారుల స్పందన మందగించినట్టు, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఉత్పత్తి లక్ష్యం కుదించినట్టు పొగాకు బోర్డు అధికారులు ఈ ప్రకటనలో పేర్కొన్నారు.








కామెంట్లు (0)