...కార్మికుల జీతం నుంచి కట్ చేసిన పిఎఫ్, ఈఎస్ఐ కార్మికుల ఖాతాకు జమ చేయాలి
...బకాయి బిల్స్ వెంటనే చెల్లించాలి
ప్రజాశక్తి-కాకినాడ : క్లాప్ వాహన డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ మాట్లాడుతూ గత పది రోజుల నుంచి క్రాప్ వాహనాలను కాంట్రాక్టు సంస్థ నిలుపుదల చేశారన్నారు. కాంట్రాక్టు వారికి కాకినాడ మున్సిపాలిటీ నుంచి ఏడు కోట్ల వరకు బకాయి చెల్లించాలని బిల్స్ చెల్లించకపోవడం వల్లే వాహనాలను నిలుపుదల చేశామని కాంట్రాక్టర్ చెప్తున్నారన్నారు. కాంట్రాక్టు సంస్థకు బిల్స్ చెల్లించకపోవడం వల్ల పది రోజుల నుంచి కార్మికులకు పని లేకుండా నిలుపుదల చేయడం దారుణమన్నారు. మరోపక్క 18 నెలల నుంచి కార్మికులకు కట్టవలసిన పిఎఫ్ ఈఎస్ఐ సొమ్ము కార్మికుల ఖాతాకు జమ చేయటం లేదని తెలియజేశారు. కాంట్రాక్టు సంస్థ, మున్సిపల్ అధికారులు ఈ సమస్య పరిష్కారానికి దృష్టి పెట్టి పనిచేయాలని వెంటనే క్లాప్ వాహనాలను ప్రారంభించాలన్నారు. క్లాప్ వాహనాలు పది రోజుల నుంచి నగరంలో చెత్త సేకరణ చేయకపోవడం వల్ల ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయిందని దీనివల్ల రాబోయే రోజుల్లో వర్షాలు కురిస్తే ప్రజలు ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. క్లాప్ వాహన డ్రైవర్ల సమస్యల పరిష్కారంలో జిల్లా కలెక్టర్ కూడా మరింత దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, యూనియన్ నాయకులు అరుణ్ కుమార్, సూరిబాబు, కుమార్, రమణ, టి శ్రీను, సాగర్, రాజు తదితరులు పాల్గొన్నారు.









కామెంట్లు (0)