రియాద్: సౌదీ అరేబియాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. దేశ తూర్పు తీరంలోని కీలకమైన చమురు హబ్ 'రాస్ తనూరా' ప్రాంతంలో సౌదీ చమురు దిగ్గజ సంస్థ 'అరామ్కో'కు చెందిన హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న 14 మంది అక్కడికక్కడే మరణించారు. మృతులంతా సౌదీ జాతీయులేనని ఆ దేశ ఇంధన మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6:00 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. రాస్ తనూరా టెర్మినల్ వద్ద చమురు లోడింగ్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైన రెండు రోజులకే ఈ విషాదం చోటుచేసుకోవడం గమనార్హం. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే, హెలికాప్టర్ కూలడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. సాంకేతిక లోపమా లేక ఇతర కారణాలా అనే కోణంలో ఇంధన మంత్రిత్వ శాఖ, ఉన్నతాధికారులతో కూడిన బృందం సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ ప్రమాదంపై ఇంధన మంత్రిత్వ శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు తమ గాఢ సానుభూతిని ప్రకటించింది.
సౌదీలో ఘోర ప్రమాదం.. అరామ్కో హెలికాప్టర్ కూలి 14 మంది మృతి
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 29, 2026, 07:11 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)