దోహా : హార్ముజ్ జలసంధిపై వివాదాన్ని పరిష్కరించుకునే దిశగా ఇరాన్తో చర్చలు కొనసాగిస్తామని అమెరికా ఉన్నతాధికారులను ఉటంకిస్తూ స్థానిక మీడియా ఆదివారం తెల్లవారుజామున తెలిపింది. మంగళవారం ఖతార్లో ఇరుదేశాలు సమావేశం కానున్నాయని అన్నారు. చర్చలు కొనసాగుతున్నందున ఇరుదేశాలు దాడులను నిలిపివేసేందుకు అంగీకరించాయని ఆ అధికారి వెల్లడించారు. తాము అన్ని సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నామని సీనియర్ అమెరికా అధికారి ఒకరు అమెరికా మీడియాకు తెలిపారు. చర్చలు కొనసాగుతున్నందున నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చని మరో అధికారి వెల్లడించారు.
జూన్ 17న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ.. అమెరికా దూకుడుగా వ్యవహరిస్తూ ఇరాన్పై దాడులకు దిగిన సంగతి తెలిసిందే.అమెరికా వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జిసి) ఆదివారం తెల్లవారుజామున కువైట్, బహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేపట్టింది. హార్ముజ్ జలసంధి సమీపంలోని తమ కేంద్రాలపై అమెరికా జరిపిన దాడులకు సమాధానంగానే ఈ సైనిక చర్య చేపట్టినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ ఆకస్మిక దాడులతో ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధ వాతావరణం నెలకొంది.









కామెంట్లు (0)