తొమ్మిదిమంది పోలీసులకు యావజ్జీవం
మహారాష్ట్ర వాషిమ్ జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు
ముంబయి: పోలీసుల అదుపులో మరణించిన బేగ్యా పవార్ కుటుంబీకులకు ఎట్టకేలకు న్యాయం దక్కింది. 15 ఏళ్లుగా ఆ కుటుంబం పోరాడుతోంది. పోలీసు కస్టడీలో జరిగిన హత్య కేసులో మహారాష్ట్ర వాషిమ్ జిల్లా సెషన్స్ కోర్టు, మాజీ స్టేషన్ అధికారితో సహా తొమ్మిది మంది పోలీసులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీంతో, అమాయకుడైన కుమారుడిని కోల్పోయిన వృద్ధ తల్లిదండ్రులకు న్యాయం లభించింది.
ఏం జరిగింది..?
2011 మే 10వ తేదీన, తెల్లవారుజామున 3 గంటలకు, రిసోద్ పోలీసులు 23 ఏళ్ల పార్ధి వాసి అయిన బేగ్యా పవార్ను అతని ఇంటి నుంచి అరెస్టు చేశారు. విచారణ కోసమే తీసుకువెళ్తున్నామని పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లిన తర్వాత, అతడిని దారుణంగా కొట్టి చంపేశారు. వైద్య పరీక్షలు నిర్వహించగా, దారుణమైన దాడి కారణంగా అతని శరీరంలోని అనేక ఎముకలు విరిగినట్టు వెల్లడైంది. ఏడాది క్రితమే వివాహం చేసుకున్న బేగ్యా పవార్కు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు. అయినప్పటికీ, అతడిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి తీవ్రంగా కొట్టారు.
ఫిర్యాదు నమోదు చేయడానికి స్టేషన్ హౌస్ ఆఫీసర్ నిరాకరణ
తమ కుమారుడి మృతి తర్వాత, ఆ వృద్ధ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడానికి రిసోద్ పోలీస్ స్టేషన్కు వెళ్లినప్పుడు, అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. ఆ ఫిర్యాదులో స్టేషన్ హౌస్ ఆఫీసర్ పేరునే చేర్చారు. దీని తరువాత, కేసు నమోదు చేయాలని ఒత్తిడి చేస్తూ ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు, ప్రదర్శనలు జరిగాయి.
సిఐడి దర్యాప్తతో వెలుగుచూసిన అరాచకాలు
ఈ దర్యాప్తును సిఐడి అధికారి అన్వర్ షేక్కు అప్పగించారు. అన్వర్ షేక్ ఈ కేసులోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేసి, కోర్టులో బలమైన చార్జిషీట్ను సమర్పించారు. ఈ ఛార్జిషీట్ పోలీసుల అరాచకాల పూర్తి నిజాన్ని వెల్లడించింది.15 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత, వాషిం జిల్లా సెషన్స్ కోర్టు ఎట్టకేలకు తన తీర్పును వెలువరించింది. అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ మహాదేవ్ మాణిక్ ధాండేతో పాటు ఎనిమిదిమంది పోలీసు అధికారులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తొమ్మిది మంది దోషులలో, అప్పటి స్టేషన్ అధికారితో సహా ఇద్దరు అధికారులు ఇప్పటికే ఉద్యోగ విరమణ చేశారు.తమ కుమారుడి హంతకులకు శిక్ష పడినందుకు ఆ వృద్ధ తల్లిదండ్రులు దేశ న్యాయవ్యవస్థకు, సీఐడీ అధికారి అన్వర్ షేక్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ తీర్పుతో ఇప్పుడు తాము ప్రశాంతంగా నిద్రపోగలమని వారు అన్నారు.








కామెంట్లు (0)