న్యూఢిల్లీ : అయోధ్య రామాలయ విరాళాల దొంగలకు శిక్షపడాలంటే బిజెపి ప్రభుత్వం మారాలి అని ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘విరాళాల దొంగలకు శిక్ష పడాలని కోరుకునేవారు ప్రభుత్వంలో మార్పు తీసుకురావాలి. దొంగలకు శిక్ష పడాలంటే ముందు ప్రభుత్వం మారాలి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, అక్కడి రాష్ట్ర ప్రభుత్వం దొంగలకు శిక్షపడనివ్వవు. అలాంటప్పుడు వారికి శిక్ష పడాలని కోరుకునే శ్రీరాముని భక్తులందరూ ప్రభుత్వాన్ని మార్చాలి. బార్ అసోసియేషన్ వారిని బహిష్కరించినప్పుడు నాకు సంతోషం కలిగింది. వీరు రాముడిని దేవుడిగా భావించరు. లేకపోతే వారు దొంగతనం చేసేవారు కాదు. శ్రీరాముడు వారికి సమస్తం ప్రసాదించాడు. 21 రాష్ట్రాల్లోనూ, కేంద్రంలోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ఆయన వారికి సహాయపడ్డాడు. వారు కనీసం వెళ్లి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి’ అని ఆయన అన్నారు.
కాగా, వారు అధికారం కోసం, డబ్బుకోసం మాత్రమే సనాత ధర్మాన్ని ఉపయోగించుకున్నారు అని కేజ్రీవాల్ ఆరోపించారు. రామ మందిర ప్రతిష్ఠ జరిగి రెండున్నర సంవత్సరాలయింది. అంటే మొత్తం 891 రోజులు గడిచాయి. ఈ రెండున్నర సంవత్సరాలలో, హోం మంత్రి అమిత్ షా ఒక్కసారి కూడా రామ మందిరాన్ని సందర్శించలేదు. శ్రీరాముడి పేరును అత్యధికంగా దుర్వినియోగం చేసిన వ్యక్తి రామ మందిరానికి వెళ్లలేదు. నేను ఇంటర్నెట్లో పరిశీలించాను. చాట్జీపీటీని అడిగాను. జర్నలిస్టులతో మాట్లాడాను. అమిత్ షా టైమ్లైన్ను కూడా చూశాను. ఆయన తన ప్రసంగాలు, ఇంటర్వ్యూలలో 42 సార్లకు పైగా రామమందిరం గురించి ప్రస్తావించారు. అలాగే దాని పేరుతో ఓట్లు కూడా అడిగారు. ఈ సందర్భంగా అమిత్ షాను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. మీకు (అమిత్షా) రామమందిరాన్ని సందర్శించాలని అనిపించడం లేదా? శ్రీరాముని ఆశీస్సులు మీకు అవసరం లేదా? రాముడిని మీరు దేవుడిగా భావించడం లేదా? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా అమిత్ షా తప్పక రామమందిరాన్ని సందర్శించాలని కేజ్రీవాల్ కోరారు.







కామెంట్లు (0)