- సెనెగల్పై 3-2 విజయం
సియాటిల్: చివరి నిమిషాల్లో అద్భుత పునరాగమనంతో బెల్జియం ప్రీక్వార్టర్స్లోకి దూసుకెళ్లింది. ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 32లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో సెనెగల్పై 3-2 తేడాతో విజయం సాధించి క్వార్టర్స్ బెర్త్ ఖాయం చేసుకుంది. మ్యాచ్ ఆరంభంలో బెల్జియం దాడులు చేసినా, ఎదురుదాడులతో సెనెగల్ పైచేయి సాధించింది. 24వ నిమిషంలో హబీబ్ డియారా గోల్తో సెనెగల్కు ఆధిక్యం లభించగా, రెండో అర్ధభాగం 51వ నిమిషంలో ఇస్మాయిలా సార్ మరో గోల్ చేసి స్కోరును 2-0కు చేర్చాడు. రెండు గోల్స్ వెనుకబడిన బెల్జియం చివరి క్షణాల్లో అసాధారణ పోరాట పటిమ కనబరిచింది. 86వ నిమిషంలో రొమెలు లుకాకు గోల్ చేయగా, 89వ నిమిషంలో యోరి టైలెమాన్స్ మరో గోల్ నమోదు చేసి స్కోరును 2-2తో సమం చేశాడు. దీంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. షూటౌట్ దిశగా సాగుతున్న మ్యాచ్లో అదనపు సమయం 120+5వ నిమిషంలో బెల్జియంకు పెనాల్టీ లభించింది. బాక్స్లో జరిగిన ఫౌల్ను వీడియో అసిస్టెంట్ రిఫరీ (VAR) పరిశీలించిన అనంతరం రిఫరీ పెనాల్టీ ఇచ్చాడు. ఆ అవకాశాన్ని యోరి టైలెమాన్స్ సద్వినియోగం చేసుకుని గోల్ చేయడంతో బెల్జియం 3-2తో సంచలన విజయం సాధించింది. చివరి క్షణాల్లో మ్యాచ్ను తమవైపు తిప్పుకున్న బెల్జియం ప్రీక్వార్టర్స్లోకి అడుగుపెట్టగా, సెనెగల్ పోరాటం రౌండ్ ఆఫ్ 32తో ముగిసింది.








కామెంట్లు (0)