- విద్యుత్ కోసం నీటి విడుదల సరికాదు
- ఇఎన్సిల సమావేశంలో కెఆర్ఎంబి
- నిర్ణయాలు తీసుకోకుండానే సమావేశం వాయిదా
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : ప్రస్తుత పరిస్థితుల్లో కృష్ణానది నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చి వాడుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలుగు రాష్ట్రాలకు సూచించింది. శుక్రవారం హైదరాద్లో జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇఎన్సిల సమావేశంలో ఈ మేరకు బోర్డు సూచన చేసింది. ఈ సమావేశానికి కెఆర్ఎంబి చైర్మన్ సుభ్రాంగ్స్ బిస్వాస్ అధ్యక్షత వహించగా, సభ్య కార్యదర్శి సతీష్కుమార్ కంబోజ్ పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల వాదనలు విన్న తరువాత ఈ సూచనను బోర్డు చేసింది. విద్యుత్ ఉత్పత్తి కోసమే జలాశయాల నుంచి నీటిని కిందకు విడుదల చేయడం సరికాదని పేర్కొంది. తాగునీటి అవసరాలను మాత్రమే రెండు రాష్ర్టాలు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఉమ్మడి జలాశయాల్లో నీరు తక్కువగా ఉన్న నేపథ్యంలో పొదుపుగా వాడుకోవాలని, కష్టకాలంలో తాగునీటికే ప్రాధాన్యత ఇవ్వాలని విభజన చట్టం చెబుతున్నదని బోర్డు గుర్తుచేసింది. విద్యుత్ ఉత్పత్తి పేరిట తెలంగాణ నీటిని దిగువకు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెఆర్ఎంబి చేసిన సూచనలకు ప్రాధాన్యత లభించింది. అదే సమయంలో పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదలను సైతం నియంత్రించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. అయితే, ఈ సమావేశంలో అధికారికంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల నాల్గవవారంలో మరోసారి కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం పూర్తి స్థాయిలో నిర్వహించి నీటి వాటాల విషయంలో నిర్ణయం తీసుకోవాలని బోర్డు అధికారులు నిర్ణయించారు
50 శాతం వాటా అడిగాం : తెలంగాణ ఇఎన్సి రమేశ్ బాబు
ఎల్నినో ప్రభావం నేపథ్యంలో తాగునీటి అవసరాల కోసం కృష్ణా జలాల్లో ఇరు రాష్ట్రాలకు 50:50 వాటా ఇవ్వాలని డిమాండ్ చేశామని తెలంగాణ ఇఎన్సి రమేష్ బాబు తెలిపారు. కానీ ఎపి మాత్రం పాత పద్ధతి ప్రకారం 66:34 నిష్పత్తిలోనే పంపిణీ చేయాలని కోరిందని, ఈ పాత వాటాను తాము అంగీకరించడం లేదని చెప్పారు. పోతిరెడ్డిపాడుతో పాటు తాజాగా వెలిగొండ నుంచి కూడా ఎపి అక్రమంగా నీటిని తరలించడాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లామన్నారు. మొత్తంగా తెలంగాణ 200 టిఎంసిలు, ఎపి 100 టిఎంసిల నీటిని కోరినట్లు తెలిపారు.
అవసరం లేకున్నా విద్యుత్ ఉత్పత్తి : ఎపి ఇఎన్సి నరసింహమూర్తి
కృష్ణా జలాలను పాత పద్ధతిలోనే 66:34 నిష్పత్తిలో పంపిణీ చేయాలని కృష్ణా బోర్డును డిమాండ్ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఇఎన్సి నరసింహమూర్తి తెలిపారు. ఎల్నినో ప్రభావంతో తాగునీటి కోసం 50:50 వాటా ఇవ్వాలన్న తెలంగాణ డిమాండ్ను తాము వ్యతిరేకించామన్నారు. వచ్చే ఆగస్టు వరకు తమకు 104 టిఎంసిల నీరు కావాలని కోరగా, తెలంగాణ 200 టిఎంసిలు అడగడం సమంజ సం కాదన్నారు. అవసరం లేకున్నా తెలంగాణ శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని పేర్కొ న్నారు. తాము ఎవరి వాటానూ లాక్కోవడం లేదని, సొంత వాటా నుంచే పోతిరెడ్డిపాడు, వెలిగొండ ద్వారా నీటిని తీసుకుంటున్నామని చెప్పారు. రాయలసీమ, మార్కాపురం, పల్నాడు తదితర జిల్లాల తాగునీటి అవసరాల కోసమే ఈ నీటిని వాడుతున్నట్లు తెలిపారు.







కామెంట్లు (0)