ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ఉద్యానవన శాఖకు ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (పిఎం ఆర్కెవివై) – పర్ డ్రాప్ మోర్ క్రాప్ (పిడిఎంసి) పథకం అమలుకు రూ.100.69 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వ్యవసాయ శాఖ సోమవారం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ప్రస్తుత బడ్జెట్ అంచనాల్లో భాగంగా ఈ నిధులను విడుదల చేశారు. ఈ నిధులను సూక్ష్మ, బిందు సేద్యం విస్తరణ, నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే ‘పర్ డ్రాప్ మోర్ క్రాప్’ కార్యక్రమం అమలుకు వినియోగించనున్నారు. ఈ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన మొత్తం రూ.400 కోట్లలో ఇప్పటికే రూ.211.57 కోట్లు అనుమతించగా, తాజాగా మరో రూ.100.69 కోట్లు విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిధుల వినియోగానికి సంబంధించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులు నిర్ణీత మార్గదర్శకాల ప్రకారం పథకం అమలుకు వినియోగించనున్నారు.








కామెంట్లు (0)