శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Success - ఇస్రో మరో చారిత్రక విజయం .. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 ప్రయోగం సక్సెస్‌

1 గంట క్రితం

Another historic success for ISRO... GSLV-F17 launch successful.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 09:14 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

విజయవంతంగా కక్ష్యలోకి ఈఓఎస్‌-05

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 ప్రయోగం సక్సెస్‌

రక్షణ, విపత్తుల నిర్వహణ, వ్యవసాయ రంగాలకు ప్రయోజనం


శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక విజయాన్ని సాధించింది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌) నుంచి శుక్రవారం తెల్లవారుజామున చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 ప్రయోగం విజయవంతమైంది. ఈ వాహకనౌక ద్వారా 2,367 కిలోల బరువున్న ఈఓఎస్‌-05 ఉపగ్రహాన్ని నిర్దేశిత సబ్‌-జియోసింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ (సబ్‌-జీటీఓ)లోకి కచ్చితత్వంతో ప్రవేశపెట్టారు. దేశ రక్షణ, విపత్తుల నిర్వహణతోపాటు వ్యవసాయం, పర్యావరణ పర్యవేక్షణ తదితర రంగాల్లో ఈ ఉపగ్రహం కీలక సేవలు అందించనుంది.


శుక్రవారం తెల్లవారుజామున 2.55 గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత, 3.13 గంటలకు ఈఓఎస్‌-05ను సబ్‌-జీటీఓలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ కక్ష్యలో పెరీజీ 170 కిలోమీటర్లు, అపోజీ 28,934 కిలోమీటర్లుగా ఉన్నాయి. సుమారు 51.7 మీటర్ల ఎత్తు, 420.5 టన్నుల బరువున్న ఈ వాహకనౌక ద్వారా చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 19వ ప్రయోగం.


విస్తృత భూ పరిశీలన ....

ఈఓఎస్‌-05 అత్యాధునిక భూ పరిశీలన సామర్థ్యాలతో రూపొందించిన ఉపగ్రహం. ఇందులోని ప్రత్యేక ఇమేజింగ్‌ పేలోడ్‌ ద్వారా విస్తృత ప్రాంతాలను అధిక స్పష్టతతో చిత్రీకరించే అవకాశం ఉంది. జియోసింక్రోనస్‌ కక్ష్యలో ఉండే ఈ ఉపగ్రహం భారత ఉపఖండాన్ని తరచూ పరిశీలించగలదు. ఒకే ఫ్రేమ్‌లో దక్షిణాసియాలోని విస్తారమైన ప్రాంతాన్ని చిత్రీకరించడంతోపాటు సుమారు పది నిమిషాల వ్యవధిలో చిత్రాలను అందించగల సామర్థ్యం దీనికి ఉంది. ఉపగ్రహంలోని ఎంఎక్స్‌-వీఎన్‌ఆర్‌ పేలోడ్‌ అత్యుత్తమ స్పేషియల్‌ రిజల్యూషన్‌తో భూ పరిశీలనకు ఉపయోగపడనుంది. జియోసింక్రోనస్‌ కక్ష్యలో ఇంత అధునాతన ఇమేజింగ్‌ సామర్థ్యం కలిగిన ఉపగ్రహం భూ పరిశీలన రంగంలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు.


రక్షణ, విపత్తుల నిర్వహణకు దోహదం ....

ఈఓఎస్‌-05 నుంచి అందే చిత్రాలు సరిహద్దు ప్రాంతాల పరిస్థితులను పర్యవేక్షించడంతోపాటు కీలక ప్రాంతాల్లో చోటుచేసుకునే మార్పులను గుర్తించేందుకు ఉపయోగపడనున్నాయి. వరదలు, తుపాన్లు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రభావిత ప్రాంతాలను వేగంగా గుర్తించేందుకు ఉపగ్రహ డేటా దోహదపడుతుంది. సహాయక, రెస్క్యూ చర్యలు, అత్యవసర ప్రణాళికల రూపకల్పనకు కూడా ఇది ఉపయోగపడనుంది. వ్యవసాయ రంగంలో పంటల పరిస్థితి, సాగు విస్తీర్ణం, భూమిలో తేమ, నీటి వనరులను పర్యవేక్షించేందుకు ఈ ఉపగ్రహ డేటా ఉపయోగపడుతుంది. వ్యవసాయ ప్రణాళికలు, నీటి నిర్వహణ, పంటల అంచనాలకు ఇది దోహదం చేయనుంది. అడవుల విస్తీర్ణంలో మార్పులు, పట్టణ ప్రాంతాల విస్తరణ, భూ వినియోగంలో మార్పులు, సహజ వనరుల పరిస్థితిని దీర్ఘకాలంగా పర్యవేక్షించడంలోనూ ఈఓఎస్‌-05 కీలక పాత్ర పోషించనుంది.


స్వదేశీ క్రయోజెనిక్‌ ఇంజిన్‌ కీలకం ....

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 మూడు దశల ప్రయోగ వాహకనౌక. ఇందులో అత్యంత క్లిష్టమైన స్వదేశీ క్రయోజెనిక్‌ అప్పర్‌ స్టేజ్‌ సమర్థవంతంగా పనిచేయడం ప్రయోగ విజయానికి కీలకంగా నిలిచింది. ఉపగ్రహాన్ని తొలుత సబ్‌-జీటీఓలోకి ప్రవేశపెట్టగా, అనంతరం ఉపగ్రహంలోని ఆన్‌బోర్డ్‌ ప్రొపల్షన్‌ వ్యవస్థ సాయంతో తుది జియోస్టేషనరీ కక్ష్యలోకి చేర్చే ప్రక్రియ కొనసాగనుంది.


2021 ఆగస్టులో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 ద్వారా ప్రయోగించిన జీశాట్‌-1 నిర్దేశిత కక్ష్యను చేరుకోలేకపోయింది. ఆ వైఫల్యానికి ప్రత్యామ్నాయంగా మరింత మెరుగైన సాంకేతికతతో రూపొందించిన ఈఓఎస్‌-05ను ఇప్పుడు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఇస్రోకు ప్రత్యేక విజయంగా నిలిచింది. గతంలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ భారీ ఉపగ్రహాలను అధిక కక్ష్యల్లోకి ప్రవేశపెట్టే సామర్థ్యాన్ని ఇస్రో మరోసారి చాటుకుంది.


వర్షంలోనూ వీక్షించిన సందర్శకులు ....

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు లాంచ్‌ వ్యూ గ్యాలరీకి సుమారు 1,500 మంది సందర్శకులు తరలివచ్చారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే వర్షం కురుస్తున్నప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. వర్షంలో తడుస్తూనే రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లిన అద్భుత ఘట్టాన్ని వీక్షించారు.


అంతరిక్ష రంగంలో మరింత బలం ....

ఈఓఎస్‌-05 ప్రయోగం భారత భూ పరిశీలన సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే కీలక మిషన్‌గా నిలిచింది. రక్షణ, విపత్తుల నిర్వహణ నుంచి వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ వరకు అనేక రంగాలకు ఉపయోగపడే ఉపగ్రహ డేటాను అందించనుంది. స్వదేశీ రాకెట్లు, క్రయోజెనిక్‌ సాంకేతికత, అధునాతన ఉపగ్రహ వ్యవస్థలతో అంతరిక్ష రంగంలో భారత్‌ సాధిస్తున్న పురోగతికి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 విజయం మరో నిదర్శనంగా నిలిచింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్