శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో ఉద్రిక్తత - విద్యార్థుల ఘర్షణ

2 గంటల క్రితం

Tension at JNTU, Kukatpally – Student Clash
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 09:57 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గురువారం అర్ధరాత్రి తీజ్‌ వేడుకల సందర్భంగా విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం ముదిరి.. గౌతమి, మంజీరా హాస్టళ్ల విద్యార్థులు పరస్పరం దాడులకు దిగారు. రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో దాడులు చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. గురువారం జేఎన్‌టీయూ హాస్టల్‌లో తీజ్‌ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిపై పలువురు దాడి చేయడంతో వివాదం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అనంతరం రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో గౌతమి, మంజీరా హాస్టళ్ల విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు విచక్షణారహితంగా దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్టల్‌ సిబ్బంది, యాజమాన్యం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందించారు. ఈ గొడవ విషయం తెలుసుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు వెంటనే జేఎన్‌టీయూ క్యాంపస్‌కు చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి విద్యార్థులను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా క్యాంపస్‌లో భద్రతా చర్యలు చేపట్టారు. ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘర్షణకు దారితీసిన కారణాలు, దాడిలో పాల్గొన్న విద్యార్థుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మరోవైపు విద్యార్థుల మధ్య ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా యూనివర్సిటీ యాజమాన్యం కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. క్యాంపస్‌లో శాంతియుత వాతావరణం కొనసాగేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్