ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాస్పోర్ట్ దరఖాస్తుల పోలీసు ధృవీకరణలో దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబర్చినందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు ప్రతిష్ఠాత్మక ‘ఇన్స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డు ఫర్ స్టేట్ పోలీస్’ లభించింది. ఈ అవార్డును కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్లో ఈ నెల 17 నుంచి 19 వరకు జరిగిన పాస్పోర్ట్ సేవా దివస్–2026 కార్యక్రమంలో ప్రదానం చేశారు.రాష్ట్ర డిజిపి హరీష్కుమార్ గుప్తా తరపున ఇంటెలిజెన్స్ విభాగం ఎస్పి రమాదేవి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. హరీష్ కుమార్ గుప్తా నేతృత్వంలో వరుసగా రెండో ఏడాది ఈ గౌరవాన్ని రాష్ట్ర పోలీసు శాఖ దక్కించుకుంది. రాష్ట్ర పోలీసు శాఖ 2025-26 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 6,32,931 పాస్పోర్ట్ దరఖాస్తుల పోలీసు వెరిఫికేషన్ సమర్థవంతంగా పూర్తి చేసి నిర్దేశిత గడువులో వేగవంతమైన ధృవీకరణ సేవలు అందించడం, పౌరులకు పారదర్శకమైన సేవలు కల్పించడం వంటి అంశాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా సేవలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వ విధానాల ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని డిజిపి శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పాస్పోర్ట్ దరఖాస్తుల పోలీసు ధృవీకరణ ప్రక్రియను అత్యంత స్వల్ప కాలంలో, ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఆధునిక సాంకేతికత వినియోగం, సమర్థవంతమైన పర్యవేక్షణ, జిల్లా స్థాయి పోలీసు యంత్రాంగం సమన్వయంతో ప్రక్రియను వేగవంతం చేశామని పేర్కొన్నారు.
ఇంటెలిజెన్స్ డిజి మహేష్ చంద్ర లడ్డా, జిల్లా ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లు, స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిబ్బంది సమిష్టి కృషి వల్లే ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు. ప్రజా సేవల్లో ఇదే స్ఫూర్తితో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.








కామెంట్లు (0)