సాయికృష్ణను చిత్రహింసలు పెట్టి, చంపేసి కనబడకుండా చేశారు
డెడ్బాడీ కూడా ఇవ్వకపోవడం దుర్మార్గం
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
సాయికృష్ణ కుటుంబ సభ్యులకు పరామర్శ
ప్రజాశక్తి - విజయవాడ : రాష్ట్రంలో ఆటవిక, అనాగరిక పాలన నడుస్తోందని, యువకుడిని పోలీసుస్టేషన్లో చిత్రహింసలకు గురిచేసి చంపి చివరకు డెడ్బాడీని కూడా కనబడకుండా చేయడం దుర్మార్గమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. కృష్ణలంకలో హత్యకు గురైన సాయికృష్ణ కుటుంబ సభ్యులను శుక్రవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ పరామర్శించారు. ఈ సందర్భంగా సాయికృష్ణ మేనమామ నాగేశ్వరరావును కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన మేనల్లుడిని తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి చంపేశారని తెలిపారు. నెలరోజులపాటు తిరిగినా పట్టించుకోకుండా వేధించారని అన్నారు. పోలీసులు తీసుకెళ్లిన సమయంలో పోలీసులంటే భయం ఉండాలనే ఉద్దేశంతో తాము కూడా మాట్లాడలేదని తెలిపారు. అయితే తీవ్రంగా కొట్టి చంపడమే కాకుండా మృతదేహాన్ని కూడా ఇవ్వలేదని తెలిపారు. కనీసం బూడిద అన్నా ఇవ్వమన్నామని, చనిపోయిన తేదీ అయినా చెప్పమని కోరామని తెలిపారు. దేనికీ స్పందనలేదని, ఇంకతంటే అన్యాయం మరొకటి లేదని తెలిపారు. అనంతరం శ్రీనివాసరావు అక్కడే మీడియాతో మాట్లాడారు.
సాయికృష్ణ ఉదంతంలో ఏమి జరిగిందో అధికారికంగా వాస్తవాలు వెల్లడించాలన్నారు. ఆయన కుటుంబానికి న్యాయం జరిగే వరకూ తాము అండగా ఉంటామని తెలిపారు. పోలీసుస్టేషన్లోనే యువకుడిని కొట్టి చంపడమే కాకుండా డెడ్బాడీని కూడా లేకుండా చేశారని తెలిపారు. సమాజంలో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అనేది అర్థం కావడం లేదని తెలిపారు. ఒకపక్క ఫ్రెండ్లీ పోలీసు అని చెబుతూనే సమాజానికి శుత్రువులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. చిన్న చిన్న కేసుల్లో ఉన్న వారిని, యువతను కొట్టి చంపుతున్న పోలీసులు పెద్దలను, ఎక్కువ కేసులు ఉన్న రాజకీయ నాయకులను పెద్దమనుషులుగా చూస్తూ వదిలేస్తున్నారని, ఇదేమి న్యాయమని ప్రశ్నించారు. సరిదిద్దే అవకాశం ఉన్న యువకులను చంపడం ఏమిటని అన్నారు. పోలీసులు వ్యవస్థ ఆటవిక పద్దతులు అనుసరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయికృష్ణ కుటుంబ సభ్యులు నెలరోజులుగా తిరుగుతున్నా ఇప్పటికీ న్యాయం చేయకపోవడం దుర్మార్గం అన్నారు. ఈ ఘటన పోలీసు వ్యవస్థ తీరుతెన్నులను బయపెడుతోందని తెలిపారు. ఎన్కౌంటర్ చేసిన సమయంలోనూ మృతదేహాలను కూడా ఇస్తున్నారని, కానీ విజయవాడ లాంటి నగరాల్లో మృతదేహాన్ని కూడా మాయం చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ఇటువంటి వారిని రాజకీయ వ్యవస్థ కాపాడుతోందని తెలిపారు. ఒక యువకుడిని కొట్టి చంపిన పోలీసు అధికారిని కాపాడటంతో ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏమిటో చెప్పాలన్నారు. ఐపిఎస్ అధికారిని నియమించి విచారణ అంటే కంటితుడుపు చర్య తప్ప మరొకటి కాదని, న్యాయ విచారణ జరపాలని అన్నారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పౌర హక్కులను కాపాడుతామని, ప్రజలకు రక్షణ కల్పిస్తామని అధికారంలోకి వచ్చారని తెలిపారు. సాయికృష్ణను పోలీసు స్టేషన్లోనే కొట్టి చంపారని తల్లి, బంధువులు అందరూ చెబుతున్నారని, ఇది లాకప్డెత్తో పాటు, శవాన్ని కూడా మాయం చేయడం దేశ, రాష్ట్ర చరిత్రలో దారుణ దుర్ఘటనని తెలిపారు. కృష్ణలంక పోలీసులు దుర్మార్గానికి క్రాంతికుమార్ అనే వ్యక్తి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. దీనికి ఎవరు కారణమో చెప్పాలన్నారు. అసలు కృష్ణలంక పోలీసు స్టేషన్లో సాయికృష్ణను ఏమి చేశారు, ఎప్పుడు తీసుకెళ్లారు, ఎందుకు మాయం చేశారో తేల్చాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పోలీసుస్టేషన్లో ఇంత దారుణం జరుగుతుంటే 40 రోజుల నుండి ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ సాయికృష్ణను తీసుకెళ్లి అన్యాయంగా కొట్టి చంపారని కుటుంబ సభ్యులు చెబుతున్నారని, వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి .కృష్ణ, బోయి సత్యబాబు పాల్గొన్నారు.







కామెంట్లు (0)