- వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ‘ఒంగోలు’
ప్రజాశక్తి - ఒంగోలు సిటీ ఒంగోలు నగర పరిధిలోని 80 వేలకు పైగా కుటుంబాలు ఉత్సాహంగా తడి, పొడి చెత్తల నిర్వహణలో తమ బాధ్యత నిర్వహించడంతో ఒంగోలు నగరం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం సంపాదించుకుంది. ఒంగోలు మున్సిపాల్టీ ఏర్పడి 150 ఏళ్లవుతున్న సందర్భంగా వివిధ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అధికార యంత్రాంగం శనివారం చేపట్టిన ‘మెగా సెగ్రిగేషన్ డ్రైవ్’ విజయవంతమైంది. డబ్ల్యుబిఆర్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఉల్లాజీ ఎలియాజర్ ప్రత్యక్ష పరిశీలనలో శనివారం ఉదయం నగరవ్యాప్తంగా మున్సిపల్ అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన రావు, విజయ్ కుమార్ పాల్గొని తడి, పొడి వ్యర్థాలను వేరు చేయటంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించారు. డిఎంహెచ్ఒ వెంకటేశ్వర్లు, జడ్పి సిఇఒ చిరంజీవి, డిపిఒ అనుపమ, మెప్మా పీడీ నారాయణ, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ రవికుమార్ కూడా నగరంలోని ఐదు శానిటేషన్ డివిజనులకు స్పెషల్ ఆఫీసర్లుగా వ్యవహరించి ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. అనంతరం, భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో ఎన్టిఆర్ కళాక్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మున్సిపల్ యంత్రాంగాన్ని డబ్ల్యుబిఆర్ ప్రతినిధి అభినందించారు. కమిషనర్ మెడలో గోల్డ్ మెడల్ వేసి ప్రశంసాపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్, పిడిసిసి బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ ముప్పవరపు సుచిత్ర, మాజీ మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటకృష్ణయ్య, ఎంహెచ్ఒ వైష్ణవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)