ప్రజాశక్తి-అమరావతి : మద్యం అక్రమ వ్యవహారానికి సంబంధించిన కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఎక్సైజ్శాఖ మాజీ అసిస్టెంట్ కమిషనర్ దొడ్డా వెంకట సత్యప్రసాద్కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేస్తూనే పలు షరతులను కూడా విధించింది. ఈ మేరకు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప సోమవారం తీర్పు చెప్పారు. ఈ కేసులో తాను అప్రూవర్గా మారేందుకు సిద్ధంగా ఉన్నానని, అందువల్ల ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సత్యప్రసాద్ తొలుత విజయవాడ ఎసిబి కోర్టును ఆశ్రయించారు. అయితే అప్రూవర్గా మారే నిందితులు కేసు తుది నిర్ణయం వచ్చే వరకు జైలులోనే ఉండాల్సి ఉంటుందని పేర్కొంటూ ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని ఎసిబి కోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో సత్యప్రసాద్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి గతంలో తీర్పును రిజర్వ్ చేశారు. సోమవారం తీర్పు వెలువరిస్తూ సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు.








కామెంట్లు (0)