తిరుపతి : తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనితకు స్వల్ప గాయమైంది. ఓ డ్రోన్కు చెందిన బ్యాటరీ ప్రమాదవశాత్తు ఆమె చేతిపై పడటంతో ఈ ఘటన జరిగింది. అమరావతి ఛాంపియన్షిప్ 2026 కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఓ డ్రోన్కు సంబంధించిన బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోయింది. దీంతో ఆ డ్రోన్ కిందికి పడిపోగా, దాంట్లోని బ్యాటరీ ఊడి, నేరుగా వేదికపై ఉన్న మంత్రి అనిత కుడిచేతిపై పడింది. ఈ అనూహ్య ఘటనతో అక్కడున్న అధికారులు, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఎస్పీ సుబ్బరాయుడు, మంత్రి అనితకు ప్రథమ చికిత్స అందించి, గాయమైన చేతికి బ్యాండేజ్ వేశారు. అయితే, చేతికి గాయమైనప్పటికీ మంత్రి అనిత బ్యాండేజ్తోనే తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. గాయం తీవ్రమైనది కాకపోవడంతో అధికారులు, పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి, ప్రమాదానికి కారణమైన డ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందా, లేక నిర్వాహకుల నిర్లక్ష్యం కారణమా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన నేపథ్యంలో విఐపి ల భద్రత, కార్యక్రమాల్లో డ్రోన్ల వినియోగంపై ఉన్న నిబంధనలను సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.
డ్రోన్ బ్యాటరీ తగిలి హోం మంత్రి అనితకు స్వల్పగాయం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 24, 2026, 12:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)