- మంత్రి అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రైతుల సంక్షేమంలో గత వైసిసి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి లేదని వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గత ఐదేళ్లలో పొగాకు రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, అప్పటి ప్రభుత్వం వారికి అండగా నిలవలేదన్నారు. ఎపి మార్క్ఫెడ్ ద్వారా కేవలం 12.93 మిలియన్ కిలోల పొగాకు మాత్రమే కొనుగోలు చేసి రైతులను మార్కెట్ కరుణకే వదిలేసిందని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొగాకు రైతుల సమస్యలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని చర్యలు చేపట్టిందని తెలిపారు. గత ఏడాదిలో రూ.270 కోట్ల విలువైన సుమారు 25 మిలియన్ కిలోల హెచ్డీ బర్లీ పొగాకును కొనుగోలు చేసి రైతులకు మద్దతుగా నిలిచామని చెప్పారు. అలాగే ఎఫ్సీవీ (వర్జీనియా) పొగాకులో, ఆఫ్స్టైల్ రకాలకు కిలోకు రూ.10 చొప్పున ప్రోత్సాహకం అందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.100 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. మొత్తం 100 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని, ప్రతి పొగాకు రైతుకు రూ.50 వేల వరకు వడ్డీలేని రుణాలు అందించే కార్యాచరణ కూడా కొనసాగుతోందని వివరించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో భాగంగా అన్ని ఖరీఫ్ పంటలకు పంటల బీమా నమోదు, ప్రీమియం చెల్లింపు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించేలా కేంద్ర ప్రభుత్వం, బీమా సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా చర్చలు జరిపిందని మంత్రి తెలిపారు. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను కేంద్ర వ్యవసాయ శాఖ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నిర్ణయం సాధ్యమైందన్నారు.








కామెంట్లు (0)