- నేడు భోగాపురం విమానాశ్రయం ప్రారంభించనున్న మోడీ
- 13 వేల మంది గిరిజన మహిళలు, విద్యార్థినుల థింసా నృత్యంతో స్వాగతం
• రూ.17,912 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి, గ్రేటర్ విశాఖ బ్యూరో : విజయనగరం జిల్లా భోగాపురంలో రూ.4,727 కోట్లతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించను న్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 13 వేల మంది గిరిజన మహిళలు, విద్యార్థినుల థింసా నృత్యంతో స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభకు జనాలను భారీగా తరలించేందుకు ఉత్తరాంధ్రలో ఐదు వేల బస్సులను ప్రభుత్వం ఊరూరా ఏర్పాటు చేసింది. భద్రత ఏర్పాట్ల కోసం ఏడు వేల మంది పోలీసులను నియమించింది. శుక్ర, శనివారాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. గడిచిన పది రోజులుగా రాష్ట్ర, జిల్లా అధికారులు, కేంద్ర, రాష్ర్ట మంత్రులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. విమానాశ్రయ ప్రారంభోత్సవంతోపాటు రాష్ట్రంలో మొత్తం రూ.17,912 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న పలు ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇక్కడి నుంచే చేయనున్నారు. గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యతనిస్తూ పవర్ గ్రిడ్ ఆధ్వర్యంలో కర్నూలు-4 ఆర్ ఇజెడ్ (4.5 గిగావాట్స్) రూ.5,550 కోట్లతో ఏర్పాటు కానున్న ట్రాన్స్మిషన్ సిస్టమ్కు శంకుస్థాపన చేయనున్నారు. కర్నూలు సోలార్/విండ్ ఎనర్జీ జోన్ (రూ.3,547 కోట్లు), అనంతపురం, కర్నూలు పరిధిలోని సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ స్కీమ్ (రూ.823 కోట్లు) లను ప్రారంభించనున్నారు. రూ.1,883 కోట్లతో రాష్ట్రంలో నిర్మించిన జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. రూ.763 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ప్యాకేజీ-4 (రెచర్ల - గుర్వాయగూడెం) పాటు రూ.933 కోట్లతో చేపట్టే ప్యాకేజీ-5 (గుర్వాయగూడెం-దేవరాపల్లి) పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.160 కోట్లతో ఎన్ హెచ్-67 తాడిపత్రి బైపాస్ 4-లేన్ల రహదారి నిర్మాణం, పెంచలకోన వద్ద లో-లెవెల్ వంతెన స్థానంలో రూ.27 కోట్లతో హై-లెవెల్ వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
భోగాపురం ఎయిర్ పోర్టు ప్రత్యేకతలు
ఈ ఎయిర్ పోర్టును 2,203 ఎకరాల్లో జిఎంఆర్ సంస్థ నిర్మించింది. 3.8 కిలోమీటర్లు రన్ వే దీని సొంతం. దేశంలో ఐదో పొడవైన రన్ వే. బోయింగ్ విమానాలు సైతం రాకపోకలు సాగించేలా ఈ రన్ వే నిర్మాణం జరిగింది. 18 ఎకరాల్లో టర్మినల్ నిర్మించారు. ఇక్కడ అత్యాధునిక 40 అత్యాధునిక చెకిన్ కౌంటర్లు, విశాలమైన లాంజ్లు, ఎస్కలేటర్లు, వేగవంతమైన స్కానర్లు వంటివి ఏర్పాటు చేశారు. పది డొమిస్టిక్, ఐదు ఇంటర్నేషనల్ సెక్యూరిటీ స్క్రీనింగ్ సెక్షన్లు, పది ఇ-గేట్లు ఉన్నాయి. ఐదు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో కార్గో కాంప్లెక్స్ను నిర్మించారు. జాతీయ రహదారిపై ఇంటర్ చేంజ్ ట్రంఫెట్ను నిర్మించారు. కొల్కతా-చెన్నయ్ హైవేపై విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి నిర్మించారు ఈ ఎయిర్పోర్టు విశాఖకు 50 కిలోమీటర్లు, విజయనగరానికి 20, శ్రీకాకుళానికి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ప్రధాని మోడీ పర్యటన ఇలా...
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఉదయం 10.45 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి నేరుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆయనకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు స్వాగతం పలుకుతారు.
• 10.50 –10.55 కారు లో ప్రయాణికుల టెర్మినల్ భవనానికి చేరుకుంటారు.
10.55 –10.58 గంటలకు కూచిపూడి నృత్యంతో ఘన స్వాగతం
• 11.00 –11.15 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలిస్తారు.
• 11.17–11.25 టెర్మినల్ భవనం నుంచి ఓపెన్ టాప్ జీప్లో బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు.
• 11.30 –12.55 విమానాశ్రయ ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, బహిరంగ సభలో ప్రసంగం.
• మధ్యాహ్నం 1.05 – 1.10 గంటలకు భోగాపురం నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం.
- మొత్తం పర్యటన వ్యవధి సుమారు 2 గంటల 25 నిమిషాలు








కామెంట్లు (0)