ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టిజిఎస్) కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని రాజస్థాన్ ప్రభుత్వానికి చెందిన ఐటిశాఖ ఉన్నతాధికారుల బృందం సందర్శించింది. రాజస్థాన్ ప్రభుత్వ రంగ సంస్థ రాజ్కాంప్ ఇన్ఫో సర్వీసెస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ లక్ష్మీకాంత్ కటార, రాజస్థాన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్టుమెంట్కు చెందిన బ్రహ్మగుప్త సెంటర్ ఆఫ్ ఫ్రంటీయర్ టెక్నాలజీస్ సంస్థ నోడల్ ఆఫీసర్ రమేష్ దవాండ, డిప్యూటీ డైరెక్టర్ నితీష్ కుమార్ జంగడిల నేతృత్వంలో అధికారులతో కూడిన ప్రతినిధుల బృందం ఆర్టిజిఎస్ పనితీరు గురించి తెలుసు కోవడానికి మంగళవారం అమరావతికి చేరుకు న్నారు. ఈ బృందానికి ఆర్టిజిఎస్ పనితీరును సిఇఒ ప్రఖర్ జైన్ పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రభుత్వంలోని 40 శాఖలను ఒకచోటకు తీసుకొచ్చి అతిపెద్ద డేటాలేక్ను రూపొందించామన్నారు. కృత్రిమ మేధ ద్వారా ఈ డేటా ఆధారంగా పాలన మరింత సరళతరం చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందేలా పలు రకాల యూస్ కేసెస్ రూపొందించామని తెలిపారు. ఆర్టిజిఎస్ సిసి టివి 360 ద్వారా శాంతిభద్రతలను పర్యవేక్షణలో పోలీసులకు ఆర్టిజిఎస్ సాంకేతిక సహకారాన్ని అందిస్తోందన్నారు. అవేర్ విభాగం ద్వారా వాతావరణ మార్పులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగట్టి ప్రాణ నష్టం, ఆస్తినష్టం వాటిల్లకుండా ఆయా ప్రాంతంలోని ప్రభుత్వ యంత్రాంగాన్ని, పౌరులను ముందస్తుగానే అప్రమత్తం చేసేలా ఈ వ్యవస్థ పనిచేస్తోందన్నారు. ఈ విభాగం ద్వారా రైతులకు ఆగ్రో అడ్వైజరీ కూడా ఇస్తున్నామని, రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో నీటి నిల్వ పరిస్థితులను, ఆయా ప్రాంతాల్లో పడే వర్షాలు, నీటి లభ్యతను రియల్ టైమ్లో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఆర్టిజిఎస్ పనితీరు అద్భుతంగా ఉందని, ఇతర రాష్ట్రాలకు ఈ వ్యవస్థ ఆదర్శప్రాయంగా ఉందని రాజస్థాన్ ప్రభుత్వ అధికారులు కొనియాడారు. ఈ సమావేశంలో ఆర్టిజిఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి శ్రీఖర్ తదితరులు పాల్గొన్నారు.
రాజస్థాన్ ఐటి బృందం ఆర్టిజిఎస్ సందర్శన
16 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 29, 2026, 05:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)