– మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం భారత తీర రక్షక దళం చేపట్టిన గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి కె.అచ్చెన్నాయుడు తెలిపారు. కోస్ట్గార్డ్ అసిస్టెంట్ కమాండింగ్ ఆఫీసర్ రంజిత్ కుమార్తో సంబంధిత అధికారులు మాట్లాడి సెర్చ్ ఆపరేషన్ పురోగతిని తెలుసుకున్నారని మంత్రి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం 5 నౌకలు, రెండు డోర్నియర్ విమానాలు, ఒక హెలికాప్టర్తో సముద్రంలో విస్తృతంగా గాలిస్తున్నట్లు కోస్ట్గార్డ్ అధికారులు తెలియజేశారన్నారని వెల్లడించారు. మత్స్యకారుల బోటుకు సంబంధించిన సమాచారాన్ని మయన్మార్, పోర్ట్బ్లెయిర్తోపాటు బంగ్లాదేశ్ సరిహద్దు తీరప్రాంతాల్లోని కోస్ట్గార్డ్ అధికారులకు చేరవేశారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లోనూ బోటు ఆచూకీ కోసం అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం బోటు ఆచూకీ లభించనప్పటికీ, సెర్చ్ ఆపరేషన్లో ఎలాంటి విరామం ఉండదని స్పష్టం చేశారు. మత్స్యకారులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కోస్ట్గార్డ్, నేవీతో నిరంతరం సమన్వయం చేసుకుంటోందని చెప్పారు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని, బోటు ఆచూకీ లభించే వరకు అన్ని మార్గాల్లో గాలింపు కొనసాగిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.








కామెంట్లు (0)