ప్రజాశక్తి - నరసాపురం: పట్టపగలు రోడ్డుపై ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో 216 జాతీయ రహదారి పై ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలానికి చెందిన జాలెం టీనా రోజా (30) ఎఎన్ఎం కోర్సు పూర్తి చేసి, శ్రీహరికోటలోని ఆస్పత్రిలో అప్రెంటిస్ నర్సుగా పనిచేస్తున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో సుళ్లూరుపేట నుంచి ఆదివారం నరసాపురానికి చేరుకొని కారులో బయలుదేరారు. పాలకొల్లు రోడ్డులోని లాక్పేటలోని పెట్రోల్ బంక్ సమీపంలో వాటర్ బాటిల్ కోసం కారు దిగగానే రమేష్ అనే వ్యక్తి కత్తితో ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాడు. ఆమె ఛాతి, పొట్ట, ఎడమ భుజంపై తీవ్రంగా పొడిచాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన కారు డ్రైవర్ సురేష్ బాబుపైనా రమేష్ కత్తితో దాడి చేసి ఛాతి భాగంలో గాయపరిచి, అక్కడి నుండి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమైన రోజాను నరసాపురం ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సురేష్ బాబు ఫిర్యాదు మేరకు నరసాపురం టౌన్ ఎస్ఐ చల్లా జయలక్ష్మి కేసు నమోదు చేశారు. రోజా కుటుంబ సభ్యులతో ఎస్ఐ మాట్లాడి వివరాల అడిగి తెలుసుకున్నారు. నరసాపురం డిఎస్ పి ఎం.సుధాకర్ రావు, నరసాపురం సిఐ బి యాదగిరి వెంటనే సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు సఖినేటిపల్లి లంక గ్రామానికి చెందిన అవివాహితుడు మార్గాని రమేష్ అనే ప్లంబింగ్ కార్మికుడిగా గుర్తించారు. పాత కక్షలు లేదా వ్యక్తిగత కారణాలే ఈ దాడికి దారితీసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. నిందితుడు దొరికితే హత్యకు కారణం తెలుస్తుంది. నరసాపురం టౌన్ సిఐ బి యాదగిరి, పెనుగొండ సిఐ విజయ్ కుమార్, పాలకొల్లు రూరల్ సిఐ జి శ్రీనివాస్ నేతృత్వంలో టీమ్ లు ఏర్పాటు చేసి నిందితుని కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
పట్టపగలు రోడ్డుపై మహిళ దారుణ హత్య
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 22, 2026, 01:05 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం







కామెంట్లు (0)