* నీట్ పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే నిర్వహించాలి
* ఫెడరల్ వ్యవస్థ ను బలహీన పరచటమే బిజెపి లక్ష్యం.
* జంతర్ మంతర్లో ప్రారంభమై... రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తరించింది
ప్రజాశక్తి కురుపాం : దేశంలో యువ స్వాతంత్ర్య పోరాటం మొదలైందని, దాని నియంత్రణ ఏ ఒక్క రాజకీయ పార్టీకీ లేదని ఢిల్లీ జంతర్ మంతర్లో నీట్ లీకేజీపై జరుగుతున్న న్యాయ పోరాటంపై స్పందిస్తూ కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్ర దేవ్ అన్నారు. విద్యార్థులకు అన్ని రకాలు విద్యకు అర్హత పరీక్షలు నిర్వహణ, సీట్లు కేటాయింపు పూర్తి అజమాయిషీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వైద్య విద్య అర్హత పరీక్ష (నీట్) తమ ఆధీనంలోకి తీసుకోవడమే చట్టవ్యతిరేకమైనదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న విద్యా సంబంధ హక్కులలో ఓ దానిని కేంద్ర ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడమే అన్నారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా దేశవ్యాప్తంగా 22లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అందకారమైందని, ఇది పూర్తి కేంద్ర విద్యాశాఖ వైఫల్యమేనన్నారు. ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీరు అత్యంత విచిత్రంగా ఉందని, ప్రతిపక్షంలో ఒకలాగ.. అధికారంలో ఒకలా ఉందని 1997లో ఎబివిపి నాయకుడిగా పరీక్ష పేపర్లు లీకేజీపై పోరాటం చేసిన వ్యక్తి... ఇప్పుడు విద్యార్థులపై లాఠీచార్జి చేయించటం నియంతృత్వ పోకడకు నిదర్శనం అన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పై పోరాటానికి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు ఇచ్చినా, సోనమ్ వాంగ్చుక్ మద్దతు పలికినా, కాంగ్రెసు పార్టీ నిరసనలలో పాల్గొన్నా ఇప్పుడు న్యాయ పోరాటం హద్దులు దాటి జంతర్ మంతర్కే పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా మొదలైందన్నారు. దీనిని నియంత్రించే పరిస్థితి ఏ ఒక్క రాజకీయ పార్టీకీ లేదన్నారు. 12ఏళ్ళు బిజెపి పరిపాలన దేశ ఫెడరల్ వ్యవస్థను బలహీనపరిచే అనేక కుట్రలకు పాల్పడిందని విమర్శించారు. కార్పోరేట్ దిగ్గజాలు తప్ప దేశంలో మిగిలిన రైతులు, చిరువ్యాపారులు, చిన్న పరిశ్రమలు, గుత్తేదారులు, నిరుద్యోగ యువతకు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. భారత రాజ్యాంగం, అభివృద్ధి, సంక్షేమ, రక్షణ చట్టాలు దశలవారీగా నిర్వీర్యానికి బిజెపి కుట్రపూరిత నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. గత యాబై ఏళ్ళలో మునుపెన్నడూ లేని పోరాటం తీవ్రతను ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్లో చూస్తున్నామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇప్పుడు దేశ ద్రోహం:
దేశంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలికితీసేందుకు ప్రయత్నం చేసినా, ప్రశ్నించినా... వారిపై లేనిపోని అభియోగాలు మోపి దేశద్రోహులుగా చిత్రించటం పరిపాటిగా మారిందన్నారు. దేశంలో వివిధ వర్గాల ప్రజలు, యువత 12ఏళ్ళ బిజెపి పరిపాలనపై విసిగిపోయి పోరాటం చేసేందుకు సిద్ధం అయ్యారని అన్నారు. ఇది ముమ్మాటికీ కేంద్ర హోంశాఖ వైఫల్యమేనని, భవిష్యత్ యువతరానిదేనని అన్నారు. న్యాయ పోరాటం చేసే యువత, మహిళలపై లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగం కేంద్ర హొంశాఖకు సరికాదన్నారు. పోలీసులు యువతకు రక్షణ ఉండాలి కానీ, ఇలా లాఠీచార్జికి పాల్పడటం హేయమైన చర్య అని అన్నారు.
మత విద్వేషాలతో ఎన్నాళ్ళు :
బిజెపి మొదటి నుంచి ప్రాంతాల వారీగా మత విద్వేషాలు రెచ్చగొట్టి 12ఏళ్ళు నియంత్రృత్వ పరిపాలన చేపట్టిందని ప్రజలు ఇప్పటికి బిజెపి నిజస్వరూపం తెలుసుకునీ దేశ వ్యాప్తంగా నిరసనలకు సిద్ధం అయ్యారని, దేశంలో క్లిష్టమైన పరిస్థితి నెలకొందని కేంద్ర ప్రభుత్వం ప్రజా అభిప్రాయానికి, హక్కులకు గౌరవం తప్పనిసరిగా ఇవ్వాలని లేకపోతే సమస్యాత్మకంగా మారినా ఆశ్చర్యపోనక్కరలేదని పేర్కొన్నారు. నీట్ లీకేజీ సమస్యకు పాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని, నిరసనలు నిలిపివేయాలని ప్రధానమంత్రి అనటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.







కామెంట్లు (0)