- బీహార్ లో ఆరేళ్ల బాలుడి పోరాటం
- తల్లిదండ్రులపై దాడి చేసిన పోలీసులపై చర్యకు డిమాండ్
పాట్నా : తల్లిదండ్రులపై దాడి చేసిన పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆరేళ్ల బాలుడు ఆదిత్య కుమార్ పోరాటానికి దిగాడు. బీహార్లో పేపర్ లీక్ నిరసనల్లో తాను పాల్గొన్నందుకు తన తల్లిదండ్రులను స్టేషన్కి పిలిచి పోలీసులు చితకబాదారని ఆదిత్య కుమార్ మీడియాకు తెలిపాడు. దీన్ని నిరసిస్తూ ఆదిత్య ఆదివారం చేపట్టిన మౌనదీక్ష రెండో రోజుకు చేరుకుంది. బాలుడి దీక్ష బీహార్లో సంచలనమైంది. 'పర్వత మానవుడు' దశరథ్ మంజీ బీహార్లో కొండను తొలిచి రహదారి నిర్మించినట్టే, తాను 'ప్రభుత్వ గర్వాన్ని బద్దలుకొడతానని' ఆ బాలుడు వ్యాఖ్యానించాడు. తల్లిదండ్రుల కు న్యాయం చేయాలని కుమార్ డిమాండ్ చేశాడు.
ఏం జరిగిందంటే?
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల అభ్యర్థులు గత వారం నిర్వహించిన నిరసనల్లో పాల్గొన్న ఆదిత్య కుమార్ ఇంటర్నెట్లో సంచలనంగా మారాడు. టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ (టిఆర్ఇ-4)కు సింగిల్-టైర్ పరీక్ష విధానం సహా పలు డిమాండ్లతో, ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయడంతోపాటు బాష్పవాయువు ప్రయోగించారు. మొదటి తరగతి చదువుతున్న కుమార్ పాట్నాలోని గర్దానీబాగ్ ప్రాంతంలో నిరసన లో పాల్గొన్నాడు. తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఆ సమయంలో తన తల్లిదండ్రులను కొట్టారని ఆదిత్యకుమార్ చెప్పాడు. రాజ్యాంగ ప్రతిని పట్టుకుని మీడియాతో మాట్లాడిన ఆదిత్య కుమార్, ‘‘నా తల్లిదండ్రులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను, మా డిమాండ్లు నెరవేరే వరకు ఈ స్థలం నుంచి కదలను. నాలాగే మరెవరి తల్లిదండ్రులనూ కొట్టకూడదని నేను కోరుకుంటున్నాను. నిరసనలో పాల్గొన్నందుకు ఒక పిల్లవాడి తల్లిదండ్రులను కొట్టాలని ఈ పుస్తకంలో ఎక్కడ రాసి ఉందో ఎవరైనా నాకు చదివి వినిపించగలరా?’’ అని ప్రశ్నించాడు.








కామెంట్లు (0)