ఎఐఆర్ఎల్ఎస్ఎ సౌత్ కోస్ట్ రైల్వే ప్రథమ జోనల్
మహాసభ తీర్మానం
ప్రజాశక్తి - కలెక్టరేట్ (విశాఖపట్నం) లోకో రన్నింగ్ స్టాఫ్ సమస్యల పరిష్కారానికి ఉధృత పోరాటాలు నిర్వహించాలని విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం జరిగిన ఎఐఎల్ఆర్ఎస్ఎ సౌత్ కోస్ట్ రైల్వే ప్రథమ జోనల్ మహాసభ తీర్మానించింది. ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ సౌత్ కోస్ట్ రైల్వే ప్రథమ జోనల్ మహాసభలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, మహా సభ ఆహ్వాన సంఘం చైర్మన్ సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ విభజన హామీల్లో భాగంగా రైల్వే జోన్ కోసం అనేక ఆందోళనలు జరిగాయన్నారు. తర్వాత జోన్ వచ్చినప్పటికీ విశాఖపట్నం డివిజన్లో ఆదాయం వచ్చే కెకె లైన్ లేకుండా చేయడం తల తీసి తోకను మాత్రమే ఉంచినట్లయిందని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్.శర్మ మాట్లాడుతూ రైల్వేను ప్రైవేటుపరం చేసే దిశగా పాలకులు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఎఐఆర్ఎల్ఎస్ఎ జాతీయ ప్రధాన కార్యదర్శి జేమ్స్ మాట్లాడుతూ రైల్వేలో లోకో రన్నింగ్ సిబ్బందిపై పని ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మహాసభలో సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ఆర్.భగత్, ట్రేడ్ యూనియన్ నాయకులు ఆర్కెఎస్వి.కుమార్, పి.మణి, బి.జగన్, జోన్ అధ్యక్షులు బిసిఎస్.రావు, ప్రధాన కార్యదర్శి బివిఎస్వి.రాజు, నాయకులు బోలోనాథ్, హరికృష్ణ, చిన్నోడు, గణేష్, సంతోష్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వివిఎల్.నరసింహులు పాల్గొన్నారు. తీర్మానాలు : హెడ్క్వార్టర్స్ దాటి సిబ్బందిని అధికంగా పనిచేయించే విధానాన్ని నిలిపివేయాలి, వారానికి రెండు రాత్రులకంటే ఎక్కువ నైట్ డ్యూటీలు విధించకూడదు, సెలవులు సకాలంలో మంజూరు చేయడానికి 30 శాతం లీవ్ రిజర్వ్ నిర్వహించాలి, 30+16 గంటల పీరియాడికల్ రెస్ట్ను పూర్తిగా అమలు చేయాలని కోరుతూ మహా సభలో పలు తీర్మానాలు చేశారు.







కామెంట్లు (0)