- మత్స్యకారుడు మృతి, ముగ్గురు సురక్షితం
ప్రజాశక్తి- ఎస్.రాయవరం (అనకాపల్లి జిల్లా): మత్స్యకారుల బోటు ప్రమాదాలు ఆగడం లేదు. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలంలో మరో బోటు బోల్తా పడింది. విశాఖ నుంచి చేపల వేటకు శనివారం వెళ్లిన బోటు బోల్తా పడిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు కావడం, వారి ఆచూకీ సోమవారం రాత్రికి కూడా తెలియకపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో బోటు ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం గ్రామానికి చెందిన నలుగురు మత్స్యకారులు సోమవారం తెల్లవారుజామున వేటకు వెళుతున్న సమయంలో సముద్రపు అలల తాకిడికి వారి పడవ బోల్తా పడింది. దీంతో, మత్స్యకారుడు చోడిపల్లి సింహాద్రి (50) గల్లంతై కొద్దిసేపటికే మృతి చెందారు. ఆయన మృతదేహం బంగారమ్మపాలెం తీరానికి కొట్టుకొచ్చింది. ఈ ప్రమాదంలో గల్లంతైన మిగిలిన ముగ్గురు మత్స్యకారులూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నక్కపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.







కామెంట్లు (0)