ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో నిర్మిస్తున్న బల్క్డ్రగ్ పార్క్ అభివృద్ధి పనులకు అవసరమైన రూ.680.21 కోట్ల టర్మ్లోన్ను హడ్కో నుంచి పొందేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. హడ్కో మంజూరు చేసిన రుణాన్ని 8.6 శాతం వడ్డీ రేటుతో పొందేందుకు ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్కు ప్రభుత్వం అనుమతి తెలిపింది. రుణానికి ప్రభుత్వ హామీతో పాటు లెటర్ ఆఫ్ కంఫర్ట్ అందించనున్నారు. మొత్తం ఆమోదిత వ్యయం రూ.1,876.66 కోట్లుగా ఉండగా, ఇందులో కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ రూ.996.45 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం/ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాటా రూ.200 కోట్లు, రుణం ద్వారా రూ.680.21 కోట్లు సమకూర్చనున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు మౌలిక వసతుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. అంతర్గత రహదారులు, విద్యుత్, నీటి సరఫరా, డ్రైనేజీ, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.








కామెంట్లు (0)