సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ప్రజాశక్తి-విజయవాడ : కమ్యూనిస్టులపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఈ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖలో ఆయనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాల్లో వినియోగదారులపై అదనపు చార్జీలు విధించే యుపిఐ సవరణ బిల్లుపై చర్చను వ్యతిరేకిస్తూ సిపిఎం రాజ్యసభ సభ్యులు వాకౌట్ చేస్తుండగా "కమ్యూనిస్టులు పిరికివాళ్లుంటూ" ఆమె వ్యాఖ్యానించడం గర్హనీయమన్నారు. ప్రజా వ్యతిరేక బిల్లులను సభలోకి తీసుకువచ్చి, వాటిపై చర్చకు సిద్ధపడకుండా ఏకపక్షంగా వాటిని ఆమోదించుకోవాలనే బిజెపి ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్న కమ్యూనిస్టులపై నిందలు వేయడం గురివింద గింజ సామెతను గుర్తుకు తెస్తున్నదన్నారు. నిజానికి ప్రధాన మంత్రి, హోంమంత్రి పిరికివాళ్లు అని ఆయన వ్యాఖ్యానించారు. రోజుల తరబడి ఢీల్లీ నడివీధుల్లో విద్యార్ధులు, నిరుద్యోగ యువత నీట్ పరిక్షా పేపర్ లీకేజీపై ఆందోళన చేస్తుంటే నోరు కూడా మెదపకుండా మౌనం పాటించిన ప్రధాన మంత్రి, హోంమంత్రిది అసలైన పిరికితనమని ఆయన విమర్శించారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి సమావేశాలకు హజరుకాకుండా మొహం చాటేయడం వారి పిరికితనానికి నిదర్శనమన్నారు. సమావేశాలకు హాజరై సభ్యులకు, దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన వారు ఇంట్లో రీల్స్ చేస్తూ కూర్చోవడం పిరికితనం కాక మరేమిటని ప్రశ్నించారు. సభ్యులు అడిగిన వాటికి సమాధానాలు చెప్పకుండా కమ్యూనిస్టులపై ఎదురుదాడి చేసి అప్రతిష్టపాలు చేయాలని చూస్తే అది అసాధ్యమన్నారు.







కామెంట్లు (0)