హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ కలకలం సృష్టించింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివాసం ఉంటున్న ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, వజ్రాలను దుండగులు అపహరించారు. ఈ దొంగతనం వెనుక సదరు ఇంట్లోనే పనిచేస్తున్న నేపాల్కు చెందిన దంపతుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సదరు వ్యాపారవేత్త నెల రోజుల క్రితమే ఈ నేపాలీ దంపతులను ఇంట్లో పనివారిగా పెట్టుకున్నారు. అయితే, కొద్దిరోజుల క్రితం యజమాని కుటుంబం వ్యక్తిగత పనిపై ముంబయికి వెళ్లి, ఆదివారం తిరిగి వచ్చేసరికి పనిమనుషులు కనిపించకుండా పోయారు. ఇంటి తాళాలు పగలగొట్టినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో వారు పని మానేసి వెళ్లిపోయారని యజమాని మొదట భావించారు. కానీ, ఆ తర్వాత పూజ గదిలోని విగ్రహానికి ఉన్న బంగారు గొలుసుతో పాటు ఇంట్లోని లాకర్లలో దాచిన విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలు మాయమైనట్లు ఆలస్యంగా గుర్తించి షాక్కు గురయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నేపాలీ ముఠా కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని, విల్లా పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ..
09 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 09, 2026, 12:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)