- ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన కేంద్రం
న్యూఢిల్లీ: ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య కార్యదర్శులు హాజరయ్యారు. సమావేశంలో ఎబోలా వైరస్ నివారణకు అవసరమైన ముందుజాగ్రత్తలు, ఆరోగ్య సన్నాహాలు, అత్యవసర స్పందన చర్యలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం భారతదేశంలో ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆఫ్రికా దేశాల్లో వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడంతో కేంద్రం అప్రమత్త చర్యలు ప్రారంభించింది. దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవుల్లో నిఘా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల స్క్రీనింగ్, అనుమానితులను క్వారంటైన్లో ఉంచడం, ప్రత్యేక పరీక్షా సదుపాయాలు కల్పించడం వంటి అంశాలపై రాష్ట్రాలకు వివరణాత్మక మార్గదర్శకాలు పంపింది. అదేవిధంగా ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని, వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించింది. గతంలో అంటువ్యాధుల సమయంలో అమలు చేసిన విధానాలను మళ్లీ కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది.
ప్రస్తుతం ఆఫ్రికా దేశమైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. అక్కడ అనేక కేసులు నమోదయ్యాయి. కాంగోతో పాటు ఉగాండా, కెన్యా వంటి పొరుగు దేశాలకు కూడా వైరస్ వ్యాపించినట్లు సమాచారం. వందలాది మంది అనుమానిత లక్షణాలతో వైద్య పర్యవేక్షణలో ఉన్నారు.








కామెంట్లు (0)