కీవ్ : నల్లసముద్రం తీరంలో ఉక్రెయిన్ ఓడరేవుపై దాడుల్లో 15మంది నావికులు చిక్కుకుపోయారు. చిక్కుకుపోయిన నావికుల్లో 13 మంది భారతీయులు ఉన్నారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. నల్లసముద్ర తీరంలోని ఉక్రెయిన్ ఓడరేవు అయిన చోర్నోమోర్స్క్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న క్షిపణి, డ్రోన్ దాడులతో 15మంది నావికులు ‘‘భయంకరమైన, ప్రాణాంతక’’ పరిస్థితుల్లో చిక్కుకుపోయారని ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్యుఐ) ఎక్స్ పోస్ట్లో పేర్కొంది. ఏ క్షణంలో నైనా తమ నౌక ఎం.వి.ఎఎంఐఆర్పై దాడి జరగవచ్చనే భయంతో ఉన్నట్లు ఆ ప్రకటన తెలిపింది. సంబంధిత అధికారులు, ఓడ యజమానులు, భారత ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, స్వదేశానికి రప్పించే ఏర్పాట్లుచేయాలని విజ్ఞప్తి చేసింది.
భారత కాలమానం ప్రకారం.. జులై 25న పలావ్ దేశపు జెండా కలిగిన జనరల్ కార్గోషిప్ ఏజిఎన్ రాగ్నార్, డాన్యూబ్ నదిలోని బైస్ట్రే ముఖ ద్వారం నుండి నల్ల సముద్రంలోకి వెళుతుండగా మూడు డ్రోన్ల దాడికి గురైనట్లు సమాచారం. 13మంది నావికుల్లో చంద్ర రామ్ దూబే, గుప్తా కుమార్ దీపక్ అనే ఇద్దరు భారతీయ నావికులు (ఆర్డినరీ సీమన్లు) నౌక నుండి నీటిలోకి దూకారని, వారి ఆచూకీ లభించలేదని అధికారులు తెలిపారు. దాడులు కొనసాగుతుండటంతో గాలింపు చర్యలను నిలిపివేసినట్లు తెలిపారు. ఇద్దరు భారతీయులు, పైలట్తో సహా మిగిలిన ఏడుగురు సిబ్బందిని ఉక్రేనియన్ కోస్ట్ గార్డ్ సురక్షితంగా ఒడ్డుకు తరలించింది.








కామెంట్లు (0)