వాషింగ్టన్ : వాణిజ్య చర్చలు విఫలమైన నేపథ్యంలో.. కెనడాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎదురుదాడికి దిగారు. ‘‘ కెనడా ఒక దేశం కాకుండానే, ఒక దేశం కలిగి ఉండే ప్రయోజనాలను కోరుకుంటోంది ’’ అని ఆదివారం ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో పేర్కొన్నారు. ‘‘ఎన్నో ఏళ్లుగా కెనడా తమ దేశ రైతులపై భారీ మొత్తంలో సుంకాలు విధించింది. ఇకపై అలా జరగదు ’’ అని అన్నారు.
అమెరికా-కెనడా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత ముదిరిన సంగతి తెలిసిందే. అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య చర్చలను కెనడా ప్రధాని మార్క్ కార్నీ నిలిపివేశారు. చివరిదశలో అమెరికా ప్రతిపాదించిన కొత్త షరతులు అన్యాయంగా, కెనడాకు ఆర్థికంగా నష్టం కలిగించే విధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దీంతో అమెరికా కెనడా దిగుమతులపై 50శాతం టారిఫ్లను విధించింది. ఈ టారిఫ్లు శనివారం నుండి అమల్లోకి రానున్నాయి. కెనడా కూడా అమెరికాపై ప్రతీకార టారిఫ్లు విధించింది. ముఖ్యంగా అమెరికాకు చెందిన ఉక్కు, పాడి పరిశ్రమలపై ఈ టారిఫ్లను విధించినట్లు కెనడా ప్రధాని మార్క్ కార్నీ తెలిపారు. ఈ కొత్త టారిఫ్లు సెప్టెంబర్ 8 నుండ అమల్లోకి వస్తాయని అన్నారు.
దశాబ్దాలుగా అమెరికా-కెనడాల మధ్య వాణిజ్య వివాదాలు ఉన్నప్పటికీ.. అమెరికా, కెనడా సన్నిహిత మిత్రదేశాలుగా కొనసాగుతున్నాయి. అయితే కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా మార్చాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, తాజాగా టారిఫ్ల పెంపు నిర్ణయాలు రెండు దేశాల మధ్య సంబంధాల్లో మరింత ఉద్రిక్తతలకు కారణమయ్యాయి.








కామెంట్లు (0)