టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్పై అమెరికా మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. ఇరాన్పై మూడో విడత దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా తెలిపింది. అమెరికా దాడుల నేపథ్యంలో హార్ముజ్ జలసంధి తీరంలోని బందర్ అబ్బాస్, సిరిక్ పట్టణాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. పరిస్థితుల దృష్ట్యా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జిసి) ప్రకటించింది. అమెరికా దురాక్రమణకు తీవ్ర ప్రతిస్పందన తప్పదని హెచ్చరించింది. అమెరికా దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై తాము క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు ఐఆర్జిసి ప్రకటించింది. ప్రిన్స్ హసన్ ఎయిర్ బేస్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో పాటు ఎంక్యూ-9 డ్రోన్ హ్యాంగర్లను ధ్వంసం చేశామని పేర్కొంది. ఈ ప్రకటనపై అమెరికా నుండి అధికారిక స్పందన వెలువడాల్సి వుంది. ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైట్, బహ్రెయిన్ దేశాలు తమ వైమానిక రక్షణ వ్యవస్థలను వినియోగిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ వారం ప్రారంభంలో మూడు వాణిజ్య చమురు ట్యాంకర్లపై ఇరాన్ దాడులు జరిపిందని అమెరికా ఆరోపించింది. అనంతరం హార్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న సైప్రస్ జెండా కలిగిన ఎంవీ జీఎఫ్ఎస్ గెలాక్సీ నౌకపై ఐఆర్జిసి బహిరంగంగా దాడి చేసిన తర్వాతే తాజా మూడో విడత దాడులు ప్రారంభించినట్లు సెంట్కామ్ వెల్లడించింది. ఈ దాడిలో నౌక ఇంజిన్ గదికి తీవ్ర నష్టం వాటిల్లగా, సిబ్బందిలో ఒకరు గల్లంతైనట్లు తెలిపింది. అమెరికా ఇరాన్ దక్షిణ తీరంలోని పలు సైనిక స్థావరాలు, టెలికమ్యూనికేషన్ టవర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు ఐఆర్జిసి పేర్కొంది. ఈ పరిణామాలతో హార్ముజ్ జలసంధి ప్రాంతంలో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయి. ప్రపంచ చమురు సరఫరాకు కీలక మార్గమైన ఈ జలసంధి మూసివేతతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.







కామెంట్లు (0)