అమరావతి : హైదరాబాద్ , విశాఖపట్నంలో ఇడి సోదాలు కలకలం రేపుతున్నాయి. రూ.3 వేల కోట్లకు పైగా భారీ చిట్ఫండ్స్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల ఆర్థిక లావాదేవీలపై ప్రధానంగా దృష్టి సారించిన ఇడి అధికారులు... ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్కు చెందిన నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో బుధవారం ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో స్థానిక అధికారులతో పాటు ప్రత్యేకంగా బీహార్కు చెందిన ఇడి బృందాలను కూడా రంగంలోకి దిగడం గమనార్హం. బీహార్లో నమోదైన కొన్ని కేసుల ఆధారంగానే ఈ విస్తృత తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చిట్ఫండ్స్ పేరుతో ప్రజల నుంచి వసూలు చేసిన నిధులను పెద్దఎత్తున దారి మళ్లించారనే ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించి పక్కా ఆధారాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. హవాలా మార్గంలో లావాదేవీలు జరిగాయా ? అనే కోణంలోనూ కూపీ లాగుతున్నారు. ఈ సోదాలు తెలుగు రాజకీయ, వ్యాపార వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
భారీ చిట్ ఫండ్స్ స్కాం - హైదరాబాద్, విశాఖలో ఇడి సోదాలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 05, 2026, 11:11 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)