నేవీ, కోస్ట్గార్డ్ గాలింపు
ప్రజాశక్తి-విశాఖపట్నం: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నెల 1వ తేదీన వీరంతా విశాఖపట్నం నుంచి బోటులో వేటకు వెళ్లారు. అయితే, సముద్రంలోకి వెళ్లిన తర్వాత వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో పాటు, ఇప్పటివరకు తిరిగి రాకపోవడంతో వారు గల్లంతైనట్లు అధికారులు నిర్ధారించారు. గల్లంతైన వారిలో అప్పలరాజు, బండియ్య, గరగయ్య, సీతుడు, చిన్న అమ్మోరు, కారి చిన్న, చిన్నయ్య ఉన్నారు. వీరిలో ఆరుగురు విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందినవారు కాగా, మరొకరు భీమిలికి చెందిన వాసిగా గుర్తించారు.
మత్స్యకారుల ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వెంటనే వారు ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. గల్లంతైన మత్స్యకారుల కోసం భారత నౌకాదళం (నేవీ), మెరైన్ పోలీస్, మరియు కోస్ట్గార్డ్ బలగాలు సముద్రంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. తమ వారు సురక్షితంగా తిరిగి రావాలని బాధితుల కుటుంబసభ్యులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.








కామెంట్లు (0)