చండీగఢ్ : భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ర్యాలీ చేపట్టేందుకు వెళుతున్న రైతులను పంజాబ్-హర్యానా సరిహద్దులో పోలీసులు అడ్డుకున్నారు. దేశ్ బచావో మోర్చా (డిబిఎం) నేతృత్వంలోని పంజాబ్ రైతులను హర్యానా -పంజాబ్ సరిహద్దులైన శంభు-అంబాలా, ఖనౌరి-జింద్ వద్ద పోలీసులు మంగళవారం నిలిపివేశారు. శంభు-అంబాలా రహదారిపై హర్యానా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో కేంద్రం భారీగా భద్రతా దళాలను మోహరించింది. రైతులు శాంతియుతంగా ఢిల్లీ ర్యాలీలో పాల్గొనేందుకు వెళుతున్నారని, బిజెపి నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం బారికేడ్లతో వారిని అడ్డుకుందని డిబిఎం సమన్వయకర్త సర్వాన్ సింగ్ పాంధేర్ పేర్కొన్నారు. స్థానిక యంత్రాంగంలతో తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని, ఘర్షణ పడే ఉద్దేశ్యం తమకు లేదని అన్నారు.
హర్యానాలోని కురుక్షేత్రలో భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు-చరుని) అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చరునిని సోమవారం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారని బికెయు (చరుని) ప్రతినిధి ప్రిన్స్ వరైచ్ మీడియాకు తెలిపారు. పెహోవా సమీపంలో పోలీసులసు చరుని వాహనాన్ని అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారని అన్నారు. రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాలకు, అలాగే దేశ ఆర్థిక, ఆహార సార్వభౌమాధికారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమైన ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ ఆందోళనలను పట్టించుకోకుండా ఈ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్తే, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల సమాఖ్య (డిబిఎం) మంగళవారం న్యూఢిల్లీలో ర్యాలీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కేవలం కొన్ని ఉత్పత్తుల దిగుమతి, ఎగుమతులకు మాత్రమే పరిమితం కాదని, వ్యవసాయం, పాడి పరిశ్రమ, పారిశ్రామిక రంగం, డిజిటల్ వాణిజ్యం, సేవా రంగం, మేధో సంపత్తి హక్కులు, ఇంధనం, పెట్టుబడులు , మార్కెట్ లభ్యత వంటి అనేక కీలక రంగాలను ఇది ప్రభావితం చేసే అవకాశం ఉందని డిబిఎం ఆందోళన వ్యక్తం చేసింది.








కామెంట్లు (0)