న్యూఢిల్లీ : అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగంపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్లను జులై 13(సోమవారం) విచారించనున్నట్లు సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. ఈ పిటిషన్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహన్లతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు జాబితా అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాల్ రావుల విఐపి దర్శన పాస్ ఐడీలను ట్రస్ట్ నిలిపివేసిందన్న వార్తలను రామజన్మభూమి ఆలయ ట్రస్ట్ సభ్యులైన మహంత్ దినేంద్ర దాస్ మహారాజ్ స్పష్టం చేశారు. చంపత్రాయ్ ఐడిని వినియోగించి పాస్లు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ముగ్గురిలో ఒకరైన అనుకల్ప్ మిశ్రాను అయోధ్య పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయోధ్య నిధుల దుర్వినియోగంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను చేపడుతున్న సంగతి తెలిసిందే. అయోధ్యలోని రామమందిర విరాళాల లెక్కింపు గదిలో తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నట్లు సిట్ ప్రాథమిక విచారణలో గుర్తించింది. అక్కడి సిబ్బంది తమ దుస్తులు, జేబులు, షూ, ఇతర వ్యక్తిగత వస్తువులలో నగదు కట్టలను దాచిపెట్టారని పేర్కొంది. అలాగే ఈ చోరీ అనేది ఏదో ఒక సందర్భంలో జరిగిన ప్రత్యేక సంఘటన కాదని, ఒక పద్ధతి ప్రకారం , పదేపదే జరిగిన వ్యవహారమని తెలిపింది.








కామెంట్లు (0)