న్యూఢిల్లీ :
దేశంలో బంగారం దిగుమతులు భారీగా తగ్గుముఖం పట్టాయి. పసిడిపై కస్టమ్స్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం దాదాపు రెట్టింపు చేయడంతో గత నెల రోజుల్లో దిగుమతులు ఏకంగా 70 శాతం మేర క్షీణించాయి. మే 13న బంగారం, వెండిపై ఉన్న దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచిన నేపథ్యంలో గతంలో నెలకు 75-100 టన్నులుగా ఉన్న దిగుమతులు ప్రస్తుతం 25-30 టన్నులకు పడిపోయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
పరిమాణం పరంగా దిగుమతులు తగ్గినప్పటికీ.. అంతర్జాతీయంగా పసిడి ధరలు భారీగా పెరగడంతో దిగుమతి బిల్లు మాత్రం ప్రభుత్వానికి భారంగానే మారింది. మే నెలలో పసిడి దిగుమతుల బిల్లు 34 శాతం పెరిగి 3.41 బిలియన్ డాలర్లకు చేరగా.. ఈ ఏడాది ఏప్రిల్-మే మధ్య కాలంలో దీని విలువ ఏకంగా 60.14 శాతం పెరిగి 9.04 బిలియన్ డాలర్లను తాకింది. ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే భారత్.. గత 2025-26 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 71.98 బిలియన్ డాలర్ల విలువైన 721.03 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోవడం గమనార్హం.








కామెంట్లు (0)