నెల రోజుల్లోనే కోస్పి సూచీ 43 శాతం పతనం
సియోల్ : చైనా నుంచి వస్తున్న కృత్రిమ మేధ (ఎఐ) పోటీ మరోవైపు చిప్ తయారీ దిగ్గజాల షేర్లు భారీగా కుప్పకూలడంతో దక్షిణ కొరియా ప్రధాన స్టాక్ మార్కెట్ సూచీ కోస్పి తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. వరుస ట్రేడింగ్ సెషన్లలో ఈ సూచీ భారీ నష్టాలను చవిచూడటంతో గత నెల రోజుల వ్యవధిలోనే రికార్డు గరిష్ఠాల నుంచి ఏకంగా 43 శాతానికి పైగా పతనమైంది. మంగళవారం మార్కెట్ ఆరంభంలోనే ఒక దశలో దాదాపు 12 శాతానికి పైగా కుంగి 5,300 స్థాయికి దిగువకు పడిపోవడంతో అధికారులు ట్రేడింగ్ను తాత్కాలికంగా నిలిపివేసి సర్క్యూట్ బ్రేకర్లను అమలు చేశారు. గతేడాది జూన్లో 9,386 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకిన ఈ సూచీ అక్కడి నుంచి ఈ స్థాయిలో క్షీణించడంతో మార్కెట్లో మదుపర్ల సంపద భారీగా ఆవిరైంది. చైనా నుంచి తక్కువ ధరలకే వస్తున్న ఎఐ మోడళ్లు ప్రపంచ మార్కెట్ల పెట్టుబడుల సరళిని దెబ్బతీస్తాయని నిపుణులు అంచనా వేయడం టెక్ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. దీనికి తోడు దక్షిణ కొరియా ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎస్కె హైనిక్స్ త్రైమాసిక ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోవడం, ఎఐ పెట్టుబడుల భయాలతో మరో దిగ్గజ సంస్థ సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ షేర్లు కూడా వరుస రోజుల్లో తీవ్ర నష్టాలను చవిచూడటం కోస్పి పతనానికి ప్రధాన కారణమయ్యాయి.








కామెంట్లు (0)