హైదరాబాద్ : బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్బియు) సెప్టెంబర్ 10 నుంచి దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఐదు రోజుల పనిదినాల అమలు, పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం (పిఎల్ఐ)లో వివక్ష తొలగింపు తదితర డిమాండ్లపై సెప్టెంబర్లో రెండు విడతలుగా సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఇది వరకు హెచ్చరించింది. తొలుత సెప్టెంబర్ 11న ఒకరోజు దేశవ్యాప్త సమ్మె జరగనుందని యుఎఫ్బియు వెల్లడించింది. ఆ రోజున సమ్మె జరిగితే.. బ్యాంకు కార్యకలాపాలకు వరుసగా నాలుగురోజుల పాటు అంతరాయం కలగనుంది. సెప్టెంబర్ 11న శుక్రవారం. తర్వాత రెండో శనివారం, ఆదివారం సాధారణ సెలవులు. ఇక సోమవారం వినాయక చవితి కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు చోట్ల బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ఈ ఆందోళనతో కేంద్రం స్పందించకపోతే, డిమాండ్లను పరిష్కరించకపోతే తిరిగి సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో వరుసగా మూడు రోజుల సమ్మె చేపట్టనున్నట్లు ఇటీవల వెల్లడించింది. అయినప్పటికీ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని యుఎఫ్బియు తీవ్రంగా హెచ్చరించింది.
ప్రధాన డిమాండ్స్..
బ్యాంకులకు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలని యుఎఫ్బియు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. 2024 మార్చి 8న కుదిరిన 12వ ద్వైపాక్షిక వేతన ఒప్పందంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) అంగీకరించిందని యుఎఫ్బియు గుర్తు చేసింది. వారానికి ఐదు రోజుల పనిదినాల అమలుకు బదులుగా సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు అదనంగా 40 నిమిషాలు పనిచేసే విధానాన్ని ప్రతిపాదించినప్పటికీ.. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం (పిఎల్ఐ)లో ఉద్యోగులు, అధికారుల మధ్య వివక్ష చూపుతున్నారని యుఎఫ్బియు ఆరోపించింది. ఈ వ్యత్యాసం ఉద్యోగుల్లో అసంతృప్తికి దారితీస్తోందని.. పిఎల్ఐ విధానాన్ని సమీక్షించి సమానత్వం తీసుకురావాలని డిమాండ్ చేసింది.








కామెంట్లు (0)